AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో భగవంతుడా.. వెదురు బొంగుల కోసం వెళితే ప్రాణమే పోయింది.. ఆ ప్రాంతంలో భయం భయం

తెలంగాణ - ఛత్తీస్గడ్ సరిహద్దు అడవుల్లో బాంబుల భయం తొలిగి పోవడంలేదు.. అమాయకుల మరణాలు ఆగడం లేదు.. ఈనెల 4వ తేదీన చలిమెల గుట్టపైన వెదురు బొంగుల కోసం వెళ్లి IED పేలుడు ఘటనలో తీవ్ర గాయాలపాలైన గిరిజనుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో మళ్ళీ భయం నెలకొంది.

అయ్యో భగవంతుడా.. వెదురు బొంగుల కోసం వెళితే ప్రాణమే పోయింది.. ఆ ప్రాంతంలో భయం భయం
Crime News
G Peddeesh Kumar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 11, 2025 | 3:23 PM

Share

తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు అడవుల్లో బాంబుల భయం తొలిగి పోవడంలేదు.. అమాయకుల మరణాలు ఆగడం లేదు.. ఈనెల 4వ తేదీన చలిమెల గుట్టపైన వెదురు బొంగుల కోసం వెళ్లి IED పేలుడు ఘటనలో తీవ్ర గాయాలపాలైన గిరిజనుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో మళ్ళీ భయం నెలకొంది. రెండు రాష్ట్రాల సరిహద్దు కర్రెగుట్ట సమీపంలోని చలిమేల గుట్టపై ఈ పేలుడు సంభవించింది.. IED పేలిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన కామయ్య అనే గిరిజనుడిని గుట్టపై నుండి స్థానికులు జోలే సహాయంతో కిందకు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చారు.. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గత నెలలో కర్రెగుట్టను 20 రోజులకు పైగా జల్లెడ పట్టిన భద్రతా బలగాలు ఆ గుట్టపై ఉన్న మందుపాతరలు అన్ని నిర్వీర్యం చేశారు. కేవలం కర్రెగుట్ట ఒక్కటే కాదు.. ఆ ప్రాంతంలోని అణువణువు గాలించారు. అయినా పేలుళ్లు ఆగడం లేదు. ఆ పరిసర ప్రాంతాల్లోని గుట్టలపై కూడా మందుపాతరలు అమాయకుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయి.. తాజాగా ఈనెల 4వ తేదీన పేలుడు సంభవించిన ఘటనలో ఓ గిరిజనుడు తీవ్రగాయాల పాలై చనిపోవడం కలకలం రేపింది.

ఈ ఘటన తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దు వెంకటాపురం మండలం చెలిమల గుట్టపై జరిగింది. ముక్కునూరుపాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య అనే గిరిజనుడు పేలుడు ఘటనలో తీవ్ర గాయాల పాలయ్యాడు.. కామయ్య సమీపంలోని చలిమేల గుట్టలపై కంక బొంగుల కోసం వెళ్ళాడు.. బొంగులు సేకరిస్తున్న క్రమంలో మందు పాతరలు గమనించకుండా ఎడమకాలు మందు పాతర పై పెట్టాడు.. ఈ క్రమంలో మందుపాతర పేలి కామయ్య కాలు నుజ్జునుజ్జయింది..

పేలుడు శబ్దం విన్న స్థానికులు కామయ్య అరుపులు విని వెంటనే అక్కడికి చేరుకున్నారు.. నడవలేని విధంగా నిస్సహాయ స్థితిలో ఉన్న కామయ్యను జోలెకట్టి గుట్టపై నుండి కిందకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న కామయ్య శుక్రవారం మృతి చెందాడు. మందుపాతర ల ముప్పు ఇంకా పొంచి ఉండడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..