
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ సచివాలయ ఉద్యోగి రాజు ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో విధుల్లో ఉండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ఘటనను గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది.
తెలంగాణ సచివాలయంలో ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా రాజు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంగళవారం (సెప్టెంబర్ 08) అసెంబ్లీ ప్రాంగణంలో విధుల్లో ఉన్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా అనారోగ్య పరిస్థితి తలెత్తి కుప్పకూలిపోయాడు. రాజు కిందపడిపోవడాన్ని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి ఆలస్యం చేయకుండా ఆయన వద్దకు వెళ్లారు. పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) చేసి ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి, అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.
రాజును ఆసుపత్రికి తరలించిన అనంతరం వైద్యులు పరీక్షించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పల్స్ లేకపోవడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజు ఆకస్మిక మృతితో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల్లో విషాదం నెలకొంది. విధుల్లో ఉండగానే సహోద్యోగి మృతి చెందడంతో పలువురు ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సచివాలయ ఉద్యోగులు, అధికారులు సంతాపం తెలిపారు. రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. విధుల్లో ఉన్న సమయంలో రాజు ఒక్కసారిగా కుప్పకూలడంతో అసెంబ్లీ ప్రాంగణంలో కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..