
గ్రామాన్ని శుభ్రం చేయాల్సిన సిబ్బంది విధులకు డుమ్మా కొట్టారు. గ్రామంలో చెత్త పేరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఆదేశాలు ఇచ్చే సర్పంచ్, వార్డు సభ్యులు.. సిబ్బంది రాలేదనీ చేతులెత్తేయకుండా పారిశుద్ధ్య కార్మికుల అవతారం ఎత్తారు. సర్పంచ్ ట్రాక్టర్ స్టీరింగ్ పట్టగా, వార్డు సభ్యులు చీపుర్లు పట్టారు. నల్లాల నీళ్లు కూడా వారే విడుదల చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామ పంచాయతీలో ఐదువేల జనాభా ఉంది. గ్రామ పంచాయతీలు పారిశుధ్య పనులు నిర్వహించేందుకు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. సిబ్బందిలో కొందరు నిత్యం విధులకు డుమ్మా కొట్టడంతో పారిశుధ్య కార్మికుల మధ్య విభేదాలు తలెత్తాయి. సక్రమంగా విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. దీంతో పారిశుద్ధ్య సిబ్బంది మూకుమ్మడిగా విధులకు డుమ్మా కొట్టారు. దీంతో గ్రామ వీధుల్లో చెత్త పేరుకుపోయే పరిస్థితి ఏర్పడడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం రంగంలోకి దిగింది. సర్పంచ్, వార్డు సభ్యులు పారిశుద్ధ కార్మికులుగా అవతారం ఎత్తారు.
సర్పంచ్ వెంకన్న స్వయంగా ట్రాక్టర్ ఎక్కి వీధుల్లో తిరుగుతూ చెత్తను సేకరించారు. అక్కడితో ఆగలేదు.. వార్డు సభ్యులు చేతిలో చీపుర్లు పట్టుకుని వీధులను శుభ్రం చేశారు. ఉప సర్పంచ్ ఉషయ్య ఎక్కడ చెత్త కనిపించినా తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చేశారు. ఒకవైపు పారిశుద్ధ్యం.. మరోవైపు తాగునీటి సరఫరా.. రెండింటినీ ప్రజాప్రతినిధులే నిర్వహించారు. సిబ్బంది మూకుమ్మడి సెలవుతో గ్రామ వీధుల్లో చెత్త పేరుకుపోయే పరిస్థితి ఏర్పడిందనీ, దీంతో పని ఆగిపోతుందని చేతులెత్తేయకుండా పారిశుద్ధ కార్మికులుగా అవతారం ఎత్తి గ్రామాన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేశారు.
గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా నల్లాల ద్వారా తాగునీటి సరఫరాను కూడా వార్డు సభ్యులే పర్యవేక్షించారు. వాల్వులు తెరిచి నీటిని విడుదల చేయడం నుంచి సరఫరా సక్రమంగా జరుగుతోందో లేదో చూసుకోవడం వరకు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా సమష్టిగా పనులు చేస్తున్నామని ఉప సర్పంచ్ ఉషయ్య చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయడం కొత్త కాదు… కానీ సిబ్బంది చేయాల్సిన పనిని కూడా భుజాన వేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..