
ఇప్పటి వరకు మనం పెద్ద ట్రాలీ ఆటోలను మొబైల్ టిఫిన్ సెంటర్లుగా నడుపుతున్న వారిని చూశాం. రోడ్డు పక్కన ఇబ్బడి ముబ్బడిగా ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉపాధి కోసం ఖమ్మంకు చెందిన ఓ యువకుడు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. మొన్నటి వరకూ మారుతీ కారులో జిరాక్స్ సెంటర్ ప్రారంభించి షాక్ ఇచ్చాడు ఒక యువకుడు. ప్రస్తుతం అతని బాటలోనే ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ ఖమ్మం జిల్లాకు చెందిన సతీష్ అనే యువకుడు. తన పాత పల్సర్ బైక్ను మొబైల్ టిఫిన్ సెంటర్గా మార్చాడు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసి.. అది రాక పోవడంతో ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేశాడు సతీష్. అయినా తనకు కుటుంబ పోషణ కష్టంగా మారడంతో.. ఇక ఉద్యోగాల వేటకు స్వస్తి చెప్పి.. తన కాళ్ళ మీద తాను నిలబడేలా సొంతంగా ఏదయినా పని చేయాలను కున్నాడు. తన బైక్నే మొబైల్ టిఫిన్ సెంటర్గా మార్చుకున్నాడు. ఖమ్మం నగరంలోని ప్రధాన సెంటర్ల వద్ద బైక్ను నిలిపి ఖమ్మం వాసులకు రుచికరమైన టిఫిన్లు అందిస్తున్నాడు. ప్రతి రోజూ కష్ట పడుతూ.. తక్కువ ఖర్చుతో టిఫిన్ సెంటర్ ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురు చూడకుండా.. ఏదో ఒకటి చేసి కుటుంబానికి ఆసరాగా నిలబడాలని నిరుద్యోగ యువతకు సూచిస్తున్నాడు. ఇతని ఆలోచనకు స్థానికులు అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..