సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ మహోత్సవం..

ముచ్చింతల్ భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శాంతి కల్యాణ మహోత్సవం కనులపండువగా జరగనుంది. శ్రీరామానుజాచార్యుల దివ్యాజ్ఞతో సాకేత రామయ్య సారధ్యంలో.. శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు ఉన్న 108 దివ్యదేశాల పెరుమాళ్లకు ఒకే వేదికపై జరుగుతున్న ఈ అపూర్వ కల్యాణ ఘట్టం ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్వితీయ ఘట్టం.

సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ మహోత్సవం..
Shanti Kalyana Mahotsavam At Muchintal

Updated on: Feb 04, 2026 | 12:51 PM

సమతాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో.. ప్రతి వేడుక మహాద్భుతం. అందులో కనులపండువగా సాగేదే శాంతి కల్యాణ మహోత్సవం. భక్తితో సమర్పించే పుష్పాలను సంతోషంగా స్వీకరించే కారుణ్య మూర్తి ఆ విభువు. అలాంటిది మనసును పువ్వులుగా సమర్పిస్తే..ఆ భగవంతుడు దివి నుంచి భువికి రాకుండా వుంటాడా.. ఒకే వేదికపై 108 దేవదేవేరులకు జరగబోయే కల్యాణ మహోత్సవానికి ముచ్చింతల్‌ ఈరోజు వేదిక కాబోతుంది. సాకేత రామయ్య సారధ్యంలో 108 దేవుళ్ల పెళ్లిని ఇలా కళ్లారా వీక్షించడం పూర్వజన్మ సుకృతం అంటారు. నేడు ముచ్చింతల్‌లో జరగబోయే శాంతికళ్యాణ మహోత్సవం..ఇల వైకుంఠపురాన్ని తలపించనుంది. శ్రీరామానుజచార్య 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతీ ఘట్టం మహా అద్భుతమే. ఇదంతా రామానుజాచార్య దివ్యాజ్ఞ అంటారు. సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి జరిగే ఈ అద్భుత మహోత్సవంలో లక్షమందికిపైగా భక్తులు పాల్గొంటున్నారు.

అయ్యవారికి అమ్మవారు.. అమ్మవారికి అయ్యవారు.. పరస్పర మాలధారణ చేస్తారు. భక్తి ప్రపత్తితో దేవదేవేరులకు పండితులు నైవేద్యాలను నివేదిస్తారు. మాఘమాసం శుభ ముహుర్తాన జరిగే ఈ శాంతి మహాకల్యాణం కన్నుల విందుగా ఉంటుంది. సమతామూర్తి వారధి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి దీక్ష స్వీకరించి నేటికి 46 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఓ విశిష్టత ఉందన్నారు శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌ స్వామి. భక్తిభావం, ఆధ్యాత్మిక పరంపర, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ కల్యాణ మహోత్సవం కొనసాగుతుందన్నారు.

స్వామి అనుజ్ఞతో అర్చకుల ద్వారా దివ్య మంగళ సూత్రధారణ.. మంగళ అక్షింతల సమర్పణతో శాంతి కల్యాణోత్సవం కనుల పండువను తలపిస్తుంది. రామానుజ సన్నిధిలో తప్ప మరెక్కడా కన్పించని అపూర్వ.. అద్వితీయ ..సమ్మోహన దృశ్యం ఈ శాంతికళ్యాణ మహోత్సవం. కళ్యాణం అంటే మంగళం కలుగజేసేదని అర్థం. సాధారణంగా బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లో రాముడికో కృష్ణుడికో కల్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకే వేదికపై శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు 108 దివ్యదేశాల పెరుమాళ్లకు ఒకేసారి శాంతి కల్యాణం జరుగుతుంది.