300 ఏళ్ల తర్వాత రామప్పలో తెరుచుకున్న సోమసూత్రం.. ఎలా తెరిచారో తెలుసా..!

యునెస్కో గుర్తింపుపొందిన రామప్ప దేవాలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది.. 300 ఏళ్ల తర్వాత శివయ్యకు నిత్య జలాభిషేకాలు ప్రారంభమయ్యాయి. మూడు శతాబ్దాల పాటు మూసుకుపోయిన సోమసూత్రం ఎట్టకేలకు తెరుచుకుంది. రామప్ప శిల్పసంపదకు ఏమాత్రం ముప్పు వాటిల్లకుండా పురావస్తుశాఖ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు శ్రమించి ఆ సోమసూత్రాన్ని తెరిచి శివయ్యకు జలాభిషేకాలు ప్రారంభించారు..

300 ఏళ్ల తర్వాత రామప్పలో తెరుచుకున్న సోమసూత్రం.. ఎలా తెరిచారో తెలుసా..!
Ramappa Temple Miracle

Edited By:

Updated on: Sep 07, 2026 | 8:35 AM

వరంగల్‌, సెప్టెంబర్ 7: తెలుగు రాష్ట్రాలలో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక నిర్మాణం రామప్ప దేవాలయం. ఈ ఆలయాన్ని కాకతీయుల పరిపాలన సమయంలో క్రీ.శ.1213లో ప్రారంభించి 40 సంవత్సరాల పాటు అబ్బురపరిచే శిల్పాలతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతుంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని పరిపాలనా సమయంలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ చారిత్రక ఆలయాన్ని నిర్మించారు. భారతదేశంలో ఒక శిల్పిపేరిట పిలువబడే ఏకైక ఆలయంగా రామప్పకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.. పూర్తిగా సాండ్ బాక్స్ టెక్నాలజీతో చేపట్టిన ఈ ఆలయంలో నీటిపై తేలే ఇటుకలు అబ్బుర పరుస్తాయి. ఎన్ని భూకంపాలు వచ్చిన, ఎంతటి ఉపద్రవాలనైనా తట్టుకుని నిలబడేలా సాండ్ బాక్స్ టెక్నాలజీతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. 2021లో ఈ చారిత్రక శిల్ప సంపద, కాకతీయుల వైభవానికి యునెస్కో గుర్తింపు లభించింది. రామప్ప విశ్వవ్యాప్త గుర్తింపు లభించింది. యునెస్కో గుర్తింపు లభించడం ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది.

ఇంతగొప్ప ఆలయంలో గత మూడువందల ఏళ్ల నుండి శివలింగానికి అభిషేకాలు లేవంటే నమ్ముతారా..? కానీ అది నిజం. 17వ శతాబ్దంలో భూకంపం సంభవించిన సమయంలో గర్భగుడిలోని సోమసూత్రం మూసుకు పోయింది. దీంతో ఆలయం గర్భగుడి నుండి నీరు బయటకు వెళ్లే సాంప్రదాయ మార్గం లేకుండా పోయింది.. అప్పటినుండి ఇప్పటివరకు రామప్పలో శివలింగానికి నిత్య అభిషేకాలు నిలిపివేశారు. ఇన్నేళ్ల తర్వాత రామప్ప ఆలయంలో శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక పరికరాలతో సోమసూత్రం పునరుద్ధరణ పనులు చేపట్టారు.. 3D మ్యాపింగ్, ఎండోస్కోపిక్, జీవో ప్రో కెమెరాలతో, రియల్ టైమ్ మానిటరింగ్ స్క్రీన్ పర్యవేక్షణలో సోమసూత్రం తెరిచారు.

 

ఇవి కూడా చదవండి

ఆలయంలోని శిల్ప సంపద, ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా సాఫ్ట్ డ్రిల్లింగ్ విధానంలో పొరలు పొరలుగా అడ్డంకులను తొలగించి సోమసూత్రం ఎట్టకేలకు పునరుద్ధరణ చేశారు. దేవదాయశాఖ అధికారులు, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు, ఇంటాక్ ప్రతినిధుల పర్యవేక్షణలో సోమసూత్రాన్ని పునరుద్ధరణ చేసి శివుడికి నిత్య నైవేద్యాలు ప్రారంభించారు. సహజంగా ప్రతి శైవక్షేత్రంలో శివలింగాలకు నిత్య అభిషేకాలు జరుగుతాయి. కానీ రామప్పలో మాత్రం 300 ఏళ్ల నుండి అభిషేకాలు లేవు. గర్భగుడి సోమసూత్రం మూసుకుపోవడం తో శివయ్యకు అభిషేకాలు కరువయ్యాయి. ఎట్టకేలకు సాంకేతిక పరిజ్ఞానంతో సోమసూత్రాన్ని తెరవడం ద్వారా మూడు శతాబ్దాల తర్వాత శివయ్యకు ఇప్పుడు నిత్య అభిషేకాలు ప్రారంభమయ్యాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us