
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని శివరాంపల్లి గ్రామంలో నవంబర్ 14న ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన(16) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు తండ్రి రెడ్డి రాజు తన కూతురు కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సైదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేశాడు. అయితే ఈ ఆత్మహత్యపై పోలీసులుకు అనుమానం రావడంతో అన్ని కోణాల్లో విచారణ జరపగా.. పేరెంట్స్ హత్య చేసినట్టు తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు రెడ్డి అర్చనకు అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. అది గమనించిన కుటుంబ సభ్యులు కూతురిని తన వైఖరి మార్చుకోవాలని కోరారు. కానీ ఆమె వినలేదు. ఈ క్రమంలో కుటుంబం పరువు పోతుందని భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అర్చన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మృతురాలు తండ్రి రాజు, తల్లి లావణ్య ఇంట్లో ఉన్న పురుగుల మందును బలవంతంగా తాగించారు. తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. కడుపు నొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులను నమ్మించారు. పోలీస్ స్టేషన్లో కూడా ఇలానే ఫిర్యాదు చేశారు. తప్పుడు కంప్లయింట్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులకు అనుమానం రావడంతో అన్ని కోణాల్లో విచారణ చేశారు. తర్వాత నిందితులు పోలీసుల విచారణలో నేరం ఒప్పుకోవడంతో అర్చన తల్లిదండ్రులపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి