
వేములవాడ సెప్టెంబర్ 07 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం కోడెనాగు ప్రత్యక్షం కావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆలయ రాజగోపురం సమీపంలో భక్తుల రాకపోకలు సాగుతున్న సమయంలో సుమారు మూడు గజాల పొడవున్న ఓ కోడెనాగు సంచరిస్తూ కనిపించింది. దీన్ని గమనించిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఆ ప్రాంతానికి భక్తులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ఆలయ అధికారులు తక్షణమే స్పందించి స్నేక్ క్యాచర్ జగదీష్కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్, రాజగోపురం వద్ద ఉన్న పామును ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తగా పట్టుకున్నారు. ఆ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆలయ సిబ్బంది భక్తులను దూరంగా ఉంచారు. పట్టుకున్న నాగుపామును సంచిలో భద్రపరిచి, ఆలయానికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతానికి తరలించి సురక్షితంగా విడిచిపెట్టారు. పామును బంధించి తరలించడంతో భక్తులు, ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆలయ పరిసరాల్లో తరచూ పాములు సంచరించే అవకాశం ఉండటంతో సిబ్బంది, భక్తులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు జనావాసాలు, ఆలయ ప్రాంగణాల్లోకి వచ్చే ముప్పు ఉన్నందున అధికారులు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.