
తెలంగాణలో కరెంట్ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం గత కొద్దిరోజులుగా సాగుతోంది. రాష్ట్రంలో విద్యుత్కు డిమాండ్ పెరగడం, వినియోగం కూడా భారీగా పెరిగిన క్రమంలో ధరల పెంపు ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ స్పందించింది. ఈ మేరకు విద్యుత్ ఛార్జీల పెంపు వార్తలపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ధరలను పెంచనున్నట్లు బయట జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఈఆర్సీ.. అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేసింది. ప్రజలు వాటిని నమ్మవద్దని సూచనలు జారీ చేసింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కరెంట్ ఛార్జీలు టారిఫ్లు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని, ఏదైనా ఉంటే తమ నుంచి అధికారిక ప్రకటన ఉంటుందని పేర్కొంది.
విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఛార్జీల పెంపు ఉండదని తెలిపింది. టైమ్ ఆఫ్ ద డే ఛార్జీల పెంపు కూడా ఉండదని స్పష్టం చేసింది. విద్యుత్ ఛార్జీల ద్వారా కేవలం రూ.40,659 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని, తమకు రూ.50,242 కోట్ల ఆదాయం అవసమని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి రూ.9,583 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, దీనికి భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వ సహకారం కోరుతున్నట్లు ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ చెప్పుకొచ్చింది. ఇక విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం నుంచి బకాయిలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉన్నప్పటికీ.. వినియోగదారులపై భారం పడకుండా లోటను ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డ్ స్థాయిలో పెరుగుతుంనది, కొత్త వినియోగదారులు వస్తూనే ఉన్నారని స్పష్టం చేసింది.
ఎస్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది కంటే 12 లక్షల మంది కొత్త వినియోగదారులు రాగా.. గరిష్ట విద్యుత్ డిమాండ్ 20,975 మెగావాట్లకు చేరుకునే అవకాశముందని ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిటీ తెలిపింది. విద్యుత్ వినియోగంలో పారిశ్రామిక రంగం మొదటి స్థానంలో ఉండగా.. గృహ వినియోగదారులు రెండో స్థానంలో ఉన్నారు. ఇక వ్యవసాయం రంగం 21 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. నాణ్యమైన విద్యుత్ను ప్రజలకుక అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. విద్యుత్ కొనుగోలు వ్యయ్యం తగ్గగా.. నష్టాలను కూడా తగ్గించామని పేర్కొంది. ఇక 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం వల్ల ఫిబ్రవరి నాటికి 5.44 కోట్ల జీరో బిల్లులను విద్యుత్ శాఖ జారీ చేయగా.. ప్రభుత్వం నుంచి రూ.1930 కోట్ల సబ్సిడీ సొమ్ము వచ్చింది.