హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని వాహనదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టోల్ ట్యాక్స్

|

Mar 31, 2025 | 8:26 AM

కేంద్ర సర్కార్ నిర్ణయంతో భారీగా టోల్ ట్యాక్స్‌లు తగ్గాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఊరట లభించింది. వాహనాలకు టోల్‌ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై మంగళవారం(ఏఫ్రిల్ 1) తెల్లవారుజాము నుంచి అమలులోకి రానున్నాయి.

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని వాహనదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టోల్ ట్యాక్స్
Toll Gate
Follow us on

రవాణా మార్గాలు పెరిగిన తర్వాత రోడ్డు ప్రయాణాలు సరదా మారిపోయాయి. ప్రయాణ ధోరణి ప్రారంభమైనప్పటి నుండి, ప్రజలు మరింత ఎక్కువ రోడ్డు ప్రయాణాలు చేయడం ప్రారంభించారు. అయితే కారు తీసుకొని ప్రయాణం ప్రారంభించాలనుకుంటే, ముందుగా మ్యాప్‌ని చూసి, ఆ తర్వాత టోల్ ఎంత ఖర్చవుతుందో చూస్తాం. ఇటీవల టోల్ ట్యాక్స్ చూసిన తర్వాత, కొన్నిసార్లు మన ప్లాన్‌లను కూడా రద్దు చేసుకుంటాం. అయితే కేంద్ర సర్కార్ నిర్ణయంతో భారీగా టోల్ ట్యాక్స్‌లు తగ్గాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఊరట లభించింది. వాహనాలకు టోల్‌ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై మంగళవారం(ఏఫ్రిల్ 1) తెల్లవారుజాము నుంచి అమలులోకి రానున్నాయి.

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని 65 జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్‌ ట్యాక్స్ తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్‌ట్యాక్స్ ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి. తెలంగాణలో చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్‌ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అత్యధికంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, తేలికపాటి ట్రాన్స్‌పోర్టు వాహనాలకు అయితే ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.

అటు ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్‌ రుసుములో 25 శాతం మినహాయింపు ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్‌ ధరలు అమలులో ఉంటాయని తెలిపింది.

ఇదిలావుంటే, తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లను జీఎమ్మార్‌ సంస్థ రూ.1,740 కోట్లతో బీవోటీ పద్ధతిలో నాలుగు వరుసల రహదారిని నిర్మించింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై 2012 డిసెంబరు నెల నుంచి పంతంగి, కొర్లపహాడ్, చిలకల్లు వద్ద ఉన్న మూడు టోల్‌ ప్లాజాల ద్వారా టోల్‌ వసూళ్లు ప్రారంభమయ్యాయి. 2024 జూన్‌ 31 వరకు జీఎమ్మార్‌ సంస్థ టోల్‌ వసూళ్లు, రహదారి నిర్వహణను పర్యవేక్షించింది. గతేడాది జులై 1 నుంచి టోల్‌ వసూళ్లను ఎన్‌హెచ్‌ఏఐ ఏజెన్సీల ద్వారా చేపడుతోంది. జీఎమ్మార్‌ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్‌ ట్యాక్స్‌లను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ వసూళ్లను చేపడుతున్న నేపథ్యంలో టోల్‌ టాక్సులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..