
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఎంపీ మల్లురవి కీలక వ్యాఖ్యలు చేశారు.రాజ్యసభ అవకాశం దొరకలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారన్నారు. బిఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని.. బీఆర్ఎస్ లోకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు, జీవన్ రెడ్డి అలాంటి పరిస్థితి రావొద్దు అని కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసిన ఈటెల రాజేందర్, రాజయ్య లాంటి వారిని బయటికి పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు ప్రముఖ పాత్ర పోషించి,14 సార్లు పార్టీ సభ్యత్వంపై జీవన్ రెడ్డి పోటీ చేశారని మల్లురవి అన్నారు. జీవన్ రెడ్డిని ఇలా చూడడం బాధాకరంగా ఉందన్నారు. కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే వారిపైనే జీవన్ రెడ్డి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారని.. దొరల గడీలకు వ్యతిరేకంగా జీవన్ రెడ్డి తండ్రి, జీవన్ రెడ్డి పోరాటం చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్లారని.. కరీంనగర్ ప్రజలకు,రైతులకు జీవన్ రెడ్డి ఏం చెప్పాలని అనుకుంటున్నారో తెలియట్లేదన్నారు.
పెత్తందారు, దొరల వ్యవస్థకు జీవన్ రెడ్డి అనుకూలంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.. బీఆర్ఎస్లో చేరిన రోజే పండగ అని, తర్వాత అంతా దండగే అన్నారు. ప్రత్యేక గుర్తింపు, పదవులు ఇస్తామని బిఆర్ఎస్ నేతలు చెప్పేది ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చని, జీవితం అంత పెంచుకున్న వ్యక్తిత్వాన్ని జీవన్ రెడ్డి దెబ్బతీసుకోకూడదన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడడం ఎంతవరకు సమంజసం?.. కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయన ఏం సంకేతం ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ,కేసీఆర్ పాలనా దేనికోసం రావాలో జీవన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.