నవజాత శిశువులకు పాలిచ్చి.. అమ్మలా ఆకలి తీరుస్తున్న బ్యాంక్.. ఎక్కడో తెలుసా?

సంగారెడ్డి జిల్లాలో ఓ బ్యాంక్ ఉంది. బ్యాంక్ అంటే నగదు లావాదేవీలది కాదు, బ్లడ్ బ్యాంక్ అంతకన్నా కాదు. చిన్నారుల ఆకలి తీర్చే మదర్ మిల్క్ బ్యాంక్. అప్పుడే పుట్టిన శిశువులకు పాలిచ్చి అమ్మలా ఆకలి తీరుస్తుంది ఈ బ్యాంక్. అసలు ఈ మదర్ మిల్క్ బ్యాంక్ పిల్లలకి పాలు ఎలా ఇస్తుంది..? మదర్ మిల్క్ బ్యాంక్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నవజాత శిశువులకు పాలిచ్చి.. అమ్మలా ఆకలి తీరుస్తున్న బ్యాంక్.. ఎక్కడో తెలుసా?
Mother And Child Health Center

Edited By: Balaraju Goud

Updated on: Jun 29, 2025 | 8:20 PM

సంగారెడ్డి జిల్లాలో ఓ బ్యాంక్ ఉంది. బ్యాంక్ అంటే నగదు లావాదేవీలది కాదు, బ్లడ్ బ్యాంక్ అంతకన్నా కాదు. చిన్నారుల ఆకలి తీర్చే మదర్ మిల్క్ బ్యాంక్. అప్పుడే పుట్టిన శిశువులకు పాలిచ్చి అమ్మలా ఆకలి తీరుస్తుంది ఈ బ్యాంక్. అసలు ఈ మదర్ మిల్క్ బ్యాంక్ పిల్లలకి పాలు ఎలా ఇస్తుంది..? మదర్ మిల్క్ బ్యాంక్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

రాష్ట్రంలో అధికంగా ప్రసవాలు జరిగే ఆస్పత్రుల్లో సంగారెడ్డిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రథమ స్థానంలో ఉంటుంది. నెలకి సుమారు 800 డెలివరీలు ఇక్కడ జరుగుతాయి. జన్యుపరమైన లోపాలు, ఒత్తిడి, వయసు కారణంగా కొందరు తల్లులకు బిడ్డ పుట్టిన వెంటనే చిన్నారికి సరిపడా పాలు ఉండవు. అలాంటి శిశువులకు డబ్బా పాలు పడుతుంటారు. దీంతో ముర్రుపాలతో వచ్చే శక్తిని నవజాత శిశువులు కోల్పోతున్నారు. మరికొందరిలో శిశువుకు అవసరమైన దానికంటే ఎక్కువ పాలు లభ్యమవుతాయి. శిశువుకు అవసరమైన దాని కంటే ఎక్కువ పాలు రావడంతో తల్లికి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఎక్కువగా ఉన్న పాలను మిషన్లతో తీసి పారబోస్తుంటారు. ఇలా పాలు లేని పిల్లలకు పాలు ఇవ్వడానికి… మిగిలిపోయిన తల్లిపాలను సద్వినియోగం చేసుకునేందుకు సంగారెడ్డిలో నూతనంగా తల్లి పాల కేంద్రం ఏర్పాటు చేశారు..

ఈ తల్లిపాల కేంద్రంలో అధునాతన మిషన్ ద్వారా డబ్బాలో తల్లి పాలు సేకరిస్తారు. పిల్లల వార్డులో ఉన్న తమ శిశువులకు ఆస్పత్రి సిబ్బంది పాలు పట్టిస్తారు. తల్లి, శిశువు చికిత్స కోసం వేరే వార్డుల్లో ఉన్న శిశువుకి మాత్రం తల్లి పాలే తాగిస్తుండటం విశేషం. ఎందుకంటే తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష అని, పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు తాగించాలని వైద్యులు సూచిస్తారు. ఇక కొందరు తల్లులకి శిశువుకి అవసరమైన మోతాదు కంటే ఎక్కువ రావడంతో అవి నేల పాలు కాకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి స్వచ్చందంగా ఈ బ్యాంక్‌కు పాలు ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నారు. దీని వల్ల పాల కొరతతో ఇబ్బందులు పడే చిన్నారులకు ఈ పాలు అమృతం కానున్నాయి. ఒక్క సారి పాలిస్తే ఆ పాలను 48 గంటల పాటు ఫ్రీజర్‌లో భద్రపరుస్తున్నారు. 48 గంటలలోపు పాల కొరతతో వచ్చిన పిల్లలకు ఆ పాలను సిబ్బంది పట్టిస్తారు…

సంగారెడ్డి ఆస్పత్రిలో 20 పడకలతో స్పెషల్ న్యూ బర్న్ కేర్ యూనిట్ కూడా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచే కాకుండా ఇతర ఆస్పత్రుల నుంచి కూడా నవజాత శిశువులను ఇక్కడికి చికిత్స కోసం తీసుకొస్తారు..దింతో ఈ పాల కేంద్రం కీలకంగా మారనుంది. మొత్తంగా మదర్ మిల్క్ బ్యాంక్ శిశువులకు సంజీవనిలా మారిందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..