
శాసనమండలిలో బీఆర్ఎస్పై కవిత మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తన రాజీనామా ఆమోదానికి ముందు మండలిలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన కవిత.. భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను కవిత సమగ్రంగా వివరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడాన్ని తాను వ్యతిరేకించానన్నారు కవిత. పార్టీలో తాను ఎప్పుడూ టికెట్ కోసం ప్రాధేయపడలేదని.. పార్టీనే తనకు పిలిచి టికెట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. రాజకీయ పదవుల కోసం తాను బతుకమ్మ ఆడలేదన్నారు. బీఆర్ఎస్లో ప్రశ్నించడం వల్లే తనను అణగదొక్కారని అన్నారు.
కేసీఆర్పై కక్షతో తనను బీజేపీ జైల్లో పెట్టిందన్న కవిత.. ఈ సమయంలో పార్టీ కూడా తనకు అండగా నిలవలేదని విమర్శించారు. 69 నాటి ఉద్యమకారులను బీఆర్ఎస్ గుర్తించలేదన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ మొదలు సచివాలయం నిర్మాణం వరకు అన్నింటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి స్థూపం వరకు అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
బీఆర్ఎస్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నారు. కేసీఆర్ను విమర్శిస్తే ఎవరూ మాట్లాడటం లేదని.. హరీష్, కేటీఆర్ను ప్రశ్నిస్తే మాత్రం ఉద్యమాలు చేస్తున్నారన్నారు. అంతర్గత ఈ అంశాలను ప్రస్తావిస్తేనే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదని.. తనది ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పుకొచ్చారు. తాను వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నానని.. కానీ శక్తిగా మళ్లీ చట్టసభల్లోకి అడుగుపెడతానని అన్నారు.
ఈ సందర్భంగా మండలిలో ఓ కవితను కూడా చదవి వినిపించారు ఎమ్మెల్సీ కవిత. అయితే కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించలేదు. భావోద్వేగంలో కవిత రాజీనామా నిర్ణయం తీసుకుని భావిస్తున్నట్టు తెలిపిన మండలి చైర్మన్.. దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు. మండలి చైర్మన్ చేసిన ఈ సూచనను కవిత తిరస్కరించారు. రాజీనామాపై పునరాలోచన లేదని స్పష్టం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
మండలిలో రాజీనామా చేసిన అనంంతరం గన్పార్క్కు చేరుకున్న కవిత.. అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణలో ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా జాగృతి పని చేస్తుందని చెప్పారు. యువత కోసం జాగృతి పార్టీగా అవతరిస్తుందని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.