MLC K Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు.. అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో సౌత్‌గ్రూప్‌..

|

Dec 01, 2022 | 7:54 AM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిగా ఉన్న అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. లిక్కర్‌ పాలసీలో పెంచిన 12 శాతం కమీషన్‌ను ఆప్‌ ప్రభుత్వానికి అప్పగించేలా లావాదేవీలు జరిపినట్టు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ ప్రస్తావించింది.

MLC K Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు.. అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో సౌత్‌గ్రూప్‌..
MLC K Kavitha
Follow us on

ఢిల్లీ మద్యం స్కాంలో సౌత్‌కు చెందిన కీలక వ్యక్తుల పేర్లను ఈడీ బయటపెట్టింది. బుధవారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సహచరుడు అమిత్‌ అరోరాను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ రిమాండ్‌ రిపోర్టును ధర్మాసనానికి అందజేసింది. ఈ రిపోర్టు ద్వారా తొలిసారిగా ఎమ్మెల్సీ కె.కవిత పేరు బయటకొచ్చింది. దక్షిణాది గ్రూప్‌ నుంచి విజయ్‌నాయర్‌కు రూ.100 కోట్లు లంచాలు అందాయని వెల్లడించింది. ఎక్సైజ్‌ అధికారులకు రూ.కోటి లంచం అందించడంలోనూ విజయ్‌నాయర్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొంది.

నిందితుడిగా ఉన్న అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. లిక్కర్‌ పాలసీలో పెంచిన 12 శాతం కమీషన్‌ను ఆప్‌ ప్రభుత్వానికి అప్పగించేలా లావాదేవీలు జరిపినట్టు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ ప్రస్తావించింది. సౌత్‌ గ్రూప్‌ పేరుతో సిండికేట్‌గా మారి 100 కోట్ల ముడుపులు ముట్టచెప్పారని ఈడీ ఆరోపించింది. పలు ఫోన్లను మార్చి కవిత లావాదేవీలు జరిపినట్లు రిపోర్ట్‌లో పొందుపర్చింది. అంతేకాదు ఆయా వ్యక్తుల ఫోన్లకు సంబంధించిన IMEI నెంబర్లను రిపోర్టులో పేర్కొంది.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా నాలుగు ఫోన్‌ నంబర్లు, విజయ్‌నాయర్‌ రెండు, సృజన్‌రెడ్డి ఒకటి, అభిషేక్‌ బోయినపల్లి ఒకటి, బుచ్చిబాబు గోరంట్ల ఒకటి, శరత్‌రెడ్డి ఒకటి, కల్వకుంట్ల కవిత రెండు ఫోన్‌ నంబర్లు వినియోగించారని, ఏయే రోజుల్లో సదరు ఫోన్‌ వినియోగించారనేది ఐఎంఈఐ నంబర్‌ సహా స్పష్టం చేసింది.

రిపోర్టులో 36 మంది ఇందులో నిందితులు, అనుమానితుల ఫోన్‌ నంబర్ల వివరాలను రిపోర్టులో పేర్కొంది. ఈ 36 మంది 170 ఫోన్లు వినియోగించి వాటిని ధ్వంసం చేశారని తెలిపింది. ఈ ఫోన్ల విలువ రూ.1.38 కోట్లు ఉంటుందని పేర్కొంది. 2022, సెప్టెంబర్‌ 23 వరకూ ఆయా ఫోన్లు వినియోగించారని తెలిపింది.

బీజేపీ నేతలు తన పేరు ప్రస్తావించడంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు కవిత. కాసేపట్లో జగిత్యాల పర్యటనకు వెళ్లనున్న కవిత..ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌పై స్పందించే అవకాశం ఉంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి..


మరిన్ని జాతీయ వార్తల కోసం