Harish Rao comments on Dalitha Bandhu: తెలంగాణలో దళితుల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రానున్న రెండున్నరేళ్లల్లో దళితులకు లక్షకోట్ల రూపాయిలు కేటాయించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆలోచన రచిస్తున్నారని స్పష్టంచేశారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది దళితబంధు కింద బడ్జెట్లో రూ.20 నుంచి 30 వేల కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖను ఆదేశించారని హరీష్ రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో రూ.50 లక్షలతో నిర్మించనున్న డా.బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనీటి భవన నిర్మాణ పనులకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు దళిత బంధు పథకం గురించి మాట్లాడారు.
రానున్న రెండున్నరేళ్లల్లో తెలంగాణలో దళితుల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయాలు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ నిధులను దళితులందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇతర పథకాలను అమలు చేసిన స్ఫూర్తితో దళిత బంధును సైతం రాష్ట్రమంతటా అమలు చేసి తీరుతామని హరీష్ రావు స్పష్టంచేశారు. కాగా.. చేర్యాలలో అన్ని హంగులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని హరీష్ రావు తెలిపారు. ఈ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Also Read: