
రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. రాష్ట్ర డీజీపీతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. వివాదాస్పద వ్యక్తి అబూ ఐమాల్ అలియాస్ అక్రమ్ అలీ మహ్మద్కు సంబంధించిన అంశంపై తీవ్ర భద్రతా ఆందోళనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తన లేఖలో ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా కారణాలతో రీజినల్ పాస్పోర్ట్ అథారిటీ రద్దు చేసిన పాస్పోర్ట్పై అక్రమ్ అలీ మహ్మద్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. గూఢచారి సంస్థల నివేదికల్లో ఆయన కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమైనట్లు, కొన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయని కూడా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన్ను “డిజిటల్ మీడియా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు”తో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆయన కోరారు. పాస్పోర్ట్ రద్దుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనంతరం అధికారిక గుర్తింపు ఎలా లభించింది? అనే విషయాల్లో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం సహా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ భద్రత విషయంలో రాజీ పడరాదని స్పష్టం చేసిన ఆయన, అవసరమైతే తగిన వేదికల్లో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పటివరకు ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.