
తెలంగాణ అసెంబ్లీలో మహిళా సంఘాల వడ్డీలేని రుణాల అంశం చిచ్చు రేపింది. ప్రభుత్వ గణాంకాలపై విపక్ష నేత కేటీఆర్ నేరుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్న లెక్క పచ్చి అబద్ధమని, అది నిరూపిస్తే తాను ఇప్పుడే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు అందించామని తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేవలం కొద్ది నెలల పాలనలో రూ.57 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వడం సాధ్యమా? అంకెల గారడీతో ప్రజలను, మహిళలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. భట్టి విక్రమార్క చెప్పినట్లు రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు ఆధారాలతో నిరూపిస్తే.. నేను ఈ క్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోతాను. మరి నిరూపించలేకపోతే ప్రభుత్వం క్షమాపణ చెబుతుందా? అని సవాల్ విసిరారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణాలను, ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఇస్తున్నట్లు చెప్పుకుంటోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కేటీఆర్ సవాల్పై ప్రభుత్వం కూడా ధీటుగానే స్పందించింది. తాము చెప్పిన గణాంకాలు వాస్తవాలని, మహిళా సంఘాల అకౌంట్లలోకి వెళ్లిన నిధుల వివరాలు తమ వద్ద ఉన్నాయని ట్రెజరీ బెంచీలు ప్రతిస్పందించాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.