
దక్షిణభారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ అయిన సింగరేణిని గత బీఆర్ఎస్ సర్కార్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాతుగా మార్చుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కొత్త బ్లాకులు తీసుకోకుండా.. వచ్చే ఆదాయానికి గండికొట్టిందని.. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా సింగరేణి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని. ఈ రెండు పార్టీల పాపం కారణంగా.. సింగరేణికి రూ.54 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థకూ ఇంతపెద్ద ఎత్తున బకాయిలు లేవని.. దీనిపై తెలంగాణ సమాజమంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే సింగరేణి అభివృద్దికి కేంద్రప్రభుత్వం ఎంతగానో సహకరించదని ఆయన అన్నారు. గతంలో BIFRలో కూరుకుపోయిన సింగరేణికి వాజ్పేయి ప్రభుత్వం రూ. 684 కోట్ల అప్పుపై మారటోరియం విధించడంతో పాటు రూ. 525 కోట్ల ఆర్థిక సహకారాన్ని అందించి ఆదుకుందని గుర్తుచేశారు. సింగరేణికి లాభం చేకూర్చేలా ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ (455 మిలియన్ టన్నులు), తాడిచర్ల-2 (340 మిలియన్ టన్నులు), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని PKOC – డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ (120 మిలియన్ టన్నులు) గనుల కేటాయింపులకు కేంద్రం చొరవ తీసుకుందన్నారు. ఈ మూడు బ్లాక్ల ద్వారా రూ. 1,95,000 కోట్ల టర్నోవర్, రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల లాభం రావడంతో పాటు 6,500 మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.
ఈ మూడు బ్లాకుల ద్వారా సుమారు 830 మిలియన్ టన్నుల బొగ్గు.. సింగరేణికి ఉత్పత్తి అవుతుందని అన్నారు. వీటి ద్వారా లక్షా 95వేల కోట్ల టర్నోవర్ సింగరేణికి వస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 40వేల కోట్ల లాభం వస్తుందని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని, సింగరేణికి ఈ బ్లాక్ కట్టబెట్టాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ బ్లాక్ జెన్కోకు వెళ్లకుండా నిర్ణయం తీసుకోవాలని.. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానన్నారు.
ఇదిగా ఉండా ప్రతిపక్షాల తీరుపై సైతం కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు – 2026ను కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పేపర్ లీకేజీలకు పాల్పడేవారు భయపడేలా కఠిన నిబంధనలు చేర్చామని వివరించారు. అయితేవిద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెచ్చిన ఈ బిల్లుకు సహకరించాల్సింది పోయి, కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, తెలంగాణలో జరిగిన పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం రైతు చట్టాల విషయంలోనైనా, విద్యార్థుల సమస్యల్లోనైనా నిరంతరం చర్చలు జరిపి ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరిస్తోందని, నేషన్ ఫస్ట్ విధానంతోనే నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,