
పులి కేవలం అడవికి అందం మాత్రమే కాదు, అది అటవీ ఆవరణ వ్యవస్థకు వెన్నెముక వంటిది. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, దాని చుట్టుపక్కల అటవీ ప్రాంతాలు పులుల సహజ ఆవాసాలుగా ఉన్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ మోహన్ ప్రకారం, ఈ అటవీ భూములు పులులతో పాటు చిరుతలు, అడవి కుక్కలు, నక్కలు, తోడేళ్లు, హైనాలు వంటి అనేక మాంసాహార జీవులకు, అలాగే దుప్పులు, జింకలు, అడవి దున్నలు వంటి శాఖాహారులకు నిలయం. అటవీ ఆవరణ వ్యవస్థలో పులికి అగ్రస్థానం ఉంటుంది. దీన్ని కీ స్టోన్ స్పీషిస్ లేదా అంబ్రెల్లా స్పీషిస్ అని పిలుస్తారు. దీని అర్థం, పులి మనుగడ ఆవరణ వ్యవస్థ సమతుల్యతకు అత్యవసరం. ఉదాహరణకు, ఒక పులి జింకను వేటాడినప్పుడు, మాంసాన్ని తిన్న తర్వాత మిగిలిన భాగాలు చిరుతలు, అడవి కుక్కలు, తోడేళ్లు వంటి చిన్న మాంసాహార జీవులకు ఆహారంగా మారతాయి. చివరకు ఎముకలను హైనాలు తింటాయి. ఈ విధంగా, పులి ఒక ఆహార గొలుసును ప్రారంభించి, ఇతర జీవులకు ఆహారాన్ని అందిస్తుంది. పులి లేకపోతే ఈ ఆహార చక్రం దెబ్బతింటుంది, ఇది ఆవరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా పులి ఒకసారి సుమారు 15–25 కిలోల మాంసం తినగలదు. అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ—ఒక్క భోజనంలో 30 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ కూడా తినే సందర్భాలు ఉంటాయి. పెద్ద జంతువును ఎక్కువగా తింటే.. 2–3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ మళ్లీ తినకపోవచ్చు.
భారతదేశంలో ఒక శతాబ్దం క్రితం లక్షకు పైగా పులులు ఉండగా, స్వాతంత్ర్యం వచ్చేనాటికి 40,000కు, 1960-70ల నాటికి కేవలం కొన్ని వందలకు పడిపోయాయి. నిరంతర వేట, ఆవాస విధ్వంసం దీనికి ప్రధాన కారణాలు. ఈ సంక్షోభాన్ని గుర్తించి, భారత ప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని తర్వాత, దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వ్లను ఏర్పాటు చేసి, పులుల సంఖ్యను పెంచడానికి విస్తృతమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలో 58 టైగర్ రిజర్వ్లు ఉండగా, తెలంగాణలో రెండు ఉన్నాయి, కవ్వాల్ వాటిలో ఒకటి. ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం ఒకప్పుడు టైగర్ ల్యాండ్గా ప్రసిద్ధి చెందింది. స్థానిక ఆదివాసీ సమాజాలు పులిని దేవుడిగా పూజించడం దీనికి నిదర్శనం.
పులుల మనుగడకు నాలుగు ప్రాథమిక అంశాలు అవసరం:
1. ఎలాంటి ఆటంకం లేని ఆవాసం: మానవ కార్యకలాపాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం.
2. పుష్కలమైన ఆహారం: శాఖాహార జంతువులకు అనువైన గ్రాస్ ల్యాండ్స్, తద్వారా పులులకు వేటాడటానికి అవకాశం.
3. నీటి లభ్యత: ఎండాకాలంలో కూడా నీటి వనరులు.
4. ప్రత్యుత్పత్తికి అనువైన పరిస్థితులు, జాతిని కొనసాగించడానికి ఆడ, మగ పులుల మధ్య సహజమైన సంతానోత్పత్తి వాతావరణం.
కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఈ అవసరాలను తీర్చడానికి అటవీ శాఖ కృషి చేస్తోంది. అటవీ మార్గాలలో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి పులుల కదలికలు, సంఖ్యను అంచనా వేస్తున్నారు. ఎండాకాలంలో నీటి కొరతను తీర్చడానికి, చిన్న చిన్న కుంటలను ఏర్పాటు చేసి, సోలార్ పంపుల ద్వారా నిరంతరం నీటిని అందిస్తున్నారు. ఇవి వలస పక్షులకు కూడా ఆశ్రయం కల్పిస్తాయి.
కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఇండియన్ బైసన్ (అడవి దున్న) వంటి భారీ జంతువులు కూడా నివసిస్తున్నాయి. ఇవి సుమారు 1000 కిలోల బరువుతో, 5-6 అడుగుల ఎత్తుతో చాలా బలీయంగా ఉంటాయి. ఇవి గుంపులుగా జీవిస్తాయి. పులులు వారానికి ఒకసారి వేటాడి, 10-40 కిలోల మాంసాన్ని తింటాయి. అవి బరువుగా ఉండటం వల్ల ఎక్కువ దూరం పరిగెత్తలేవు, 20-50 మీటర్ల వేగవంతమైన పరుగులో మాత్రమే వేటను పట్టుకోగలవు. సాధారణంగా 20 ప్రయత్నాలలో 1-2 సార్లు మాత్రమే పులి వేటలో విజయవంతమవుతుంది. ఈ అటవీ ప్రాంతంలో టేకు చెట్లతో పాటు మోదుగు తీగలు వంటివి కూడా ఉన్నాయి. ఈ తీగలు చాలా గట్టిగా ఉంటాయి. అడవి పురాతనత్వాన్ని సూచిస్తాయి. ఆవరణ వ్యవస్థలో ఎండిపోయిన చెట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పక్షులు వాటిపై కూర్చుని ఆహారం కోసం వేటాడతాయి, గూళ్లు కట్టుకుంటాయి (ఉదాహరణకు రామచిలకలు, గూడ్ల గూబలు). అందువల్ల, సంరక్షిత ప్రాంతాల నుండి ఏ చెట్టును కూడా తొలగించరు. కవ్వాల్ అటవీ ప్రాంతం పులులకే కాకుండా అనేక ఇతర జీవుల మనుగడకు, మొత్తం ఆవరణ వ్యవస్థ సమతుల్యతకు చిహ్నంగా నిలుస్తుంది.