
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేధింపులకు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవేలి కొత్తపల్లి గ్రామానికి చెందిన కళ్యాణం రవి అనే వ్యక్తికి కళ్యాణం రాకేష్కు అనే కుమారుడు ఉన్నాడు. అయితే అతను ఇటీవలే హైదరాబాద్కు చెందిన సంజనా అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ తిగల గుట్టపల్లి, సరస్వతి నగర్లో నివాసం ఉంటున్నారు.
అయితే పెళ్లైన కొన్నాళ్లు పాటు బాగానే ఉన్నా.. తర్వాత సంజనా రాకేష్ను ఆంక్షలు పెట్టడం స్టార్ట్ చేసింది. రాకేష్ను తన తల్లిదండ్రులను కలవద్దని, వారితో ఫోన్లో కూడా మాట్లాడొద్దని అడ్డుకోవడంతో పాటు మానసికంగా అతన్ని వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మానసిక వేధింపులను తట్టుకోలేకనే.. జీవితంపై విరక్తి చెందిన రాకేష్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని రాకేష్ తండ్రి కరీనంగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బంగారం ఆభరణాలు తేవాలంటు, పుట్టినింటి వారిని కలవకూడదంటూ మానసికంగా హింసించిన కారణంగానే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 243/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.