
8 సంవత్సరాల క్రితం కొడుకు ఆత్మహత్య కేసులో కోర్టు తీర్పుతో ఆ తల్లి మనస్సు కుదుటపడింది. దోషులకు ఎట్టకేలకు శిక్ష పడిందంటూ తన సంతోషాన్ని అందరితో పంచుకుంది. ఈ కేసులో విచారణ పూర్తి చేసి నిందితుందరినీ కోర్టు ముందు నిలబెట్టిన పోలీసుల్ని ఘనంగా సన్మానించింది. తన కొడుకు ఆత్మకు ఇప్పటికి శాంతి చేకూరింది అంటూ కన్నీరు పెట్టుకుని భావోద్వేగానికి లోనైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగింది. ఉన్న ఊరిలోనే భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో భర్త భరించలేకపోయాడు.. వద్దని వారించాడు.. ఆమెలో మార్పులేకపోగా భర్తను మరింత మానసిక వేధింపులకు గురిచేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొడుకు చావుకు కారణమైన నిందితులకు శిక్ష పడేందుకు అతని తల్లి చెప్పులరిగేలా.. పోలీసులు, కోర్టు చుట్టూ తిరిగి.. న్యాయం చేయాలని ప్రాథేయపడింది.. ఈ క్రమంలోనే.. ప్రధాన నిందితులకు శిక్షపడటంతో.. పోలీసులను తల్లి సన్మానించింది.
వివరాల ప్రకారం.. అశ్వారావుపేటకు చెందిన ముత్యాలరావుకి 2014లో నారాయణపురం గ్రామానికి చెందిన శ్యామలతో వివాహమైంది. కొన్నాళ్లపాటు కాపురం బాగానే సాగినా, మరో వ్యక్తితో భార్యకు సంబంధం ఉందనే విషయం బయటపడడంతో గొడవలు మొదలయ్యాయి. ముత్యాలరావు పలుమార్లు హెచ్చరించినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రాలేదు. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టినా కూడా ముత్యాలరావుకి మద్దతు రాలేదు. పెద్ద మనుషులు కూడా ముత్యాలరావును కించపరచటంతో మానసికంగా కుంగిపోయి 2018 జులై 31న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో.. తన కొడుకు మృతికి 14 మంది కారణమంటూ ముత్యాలరావు తల్లి తిరుపతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన అశ్వారావుపేట పోలీసులు విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. పలు దఫాలుగా వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. శ్యామలకు ఏడేళ్లు జైలు శిక్ష పడింది. వెంకటేశ్వరరావు సహా మిగతా ముద్దాయిలకూ వేర్వేరుగా శిక్షలు ఖరారు అయ్యాయి. తన కొడుకు చావుకు కారణమైన వాళ్లకు ఎట్టకేలకు శిక్ష పడింది అనే సంతోషంలో తిరుపతమ్మ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అశ్వారావుపేటలో సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సై యయాతి రాజుతోపాటు స్టేషన్ సిబ్బందిని సన్మానించారు. మిఠాయిలు పంచారు. నిందితులు హైకోర్టుకు వెళ్తే అక్కడా తాను పోరాటం చేస్తానని ఆమె చెప్తున్నారు.