Swaeroes IPS Praveen Kumar : స్వేరోస్ వివాదాస్పద ప్రతిజ్ఞపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ దీనికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనపై హిందూ వ్యతిరేకిగా బీజేపీ నేతలు ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. తన భార్య, సోదరి అందరూ హిందువులేనని ఆయన తెలిపారు.
” నేను స్వేరోస్ లో సభ్యుడిని.. నా భావజాలం అందులో ఉంది. స్వేరోస్ సంస్థకు విదేశీ నిధులు వస్తున్నాయనేది అవాస్తవం. నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. స్వేరోస్ ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థ కాదు. నేను ఏ పదవిలోనైనా పనిచేయడానికి సిద్ధం. దేశంలో హిందూ, నాన్ హిందూ విభజన రేఖలు పెరుగుతున్నాయి. బీజేపీ నేతల ఆరోపణలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. అని ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఇలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం స్వేరో యూనియన్ ఏటా భీమ్ దీక్ష పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. కాన్షీరాం జయంతి నుంచి అంబేడ్కర్ జయంతి వరకూ నెల రోజుల పాటూ ఇది సాగుతుంది. ఏటా ఈ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు స్వేరో పూర్వ, ప్రస్తుత విద్యార్థులు. ఈసారి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట వద్ద 2 వేల ఏళ్ల నాటి ప్రాచీన బౌద్ధ స్తూపం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో హిందూ దేవుళ్లపై తనకు నమ్మకం లేదు అన్న మాటలు వినిపించడంతో బీజేపీ నేతలు సహా పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు, ప్రవీణ్ కుమార్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. కొందరు కేసులు పెట్టారు. ఆయనతో పాటు మొత్తంగా స్వేరో సంస్థ హిందూ వ్యతిరేక భావాలను ప్రచారం చేస్తోందన్న ఆరోపణలు కూడా పెరుగుతోన్న సంగతి తెలిసిందే.
Read also : Amaravati Land Scam Case : అమరావతి భూముల స్కామ్పై హైకోర్టులో విచారణ, మందడం దళిత రైతులను ఆరా తీస్తున్న సీఐడీ