Telangana Politics: ‘టచ్‌ చేసి చూడు’.. ‘చెత్తనంతా తొలగిస్తాం’.. రాజీవ్ విగ్రహం చుట్టూ తెలంగాణ రాజకీయం..

|

Aug 20, 2024 | 9:48 PM

తెలంగాణలో రాజీవుడి విగ్రహం చుట్టూ ముసురుకున్న రాజకీయ వివాదం సరికొత్త పీక్స్‌కి చేరుకుంది. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్.. కామెంట్లు-కౌంటర్లు, సవాళ్లు-ఛాలెంజ్‌లతో బార్డర్లు దాటేశాయి. మధ్యలో తెలంగాణ సెంటిమెంటును కూడా టచ్ చేస్తూ.. క్షేత్రస్థాయిలో క్యాడర్‌లో భావావేశాలకు తావిస్తున్నారు నేతలు.

Telangana Politics: ‘టచ్‌ చేసి చూడు’.. ‘చెత్తనంతా తొలగిస్తాం’.. రాజీవ్ విగ్రహం చుట్టూ తెలంగాణ రాజకీయం..
KTR - Revanth Reddy
Follow us on

దివంగత నేతల విగ్రహాల కోసం నిగ్రహాలు కోల్పోయి కొట్లాటకు దిగడం మన పొలిటీషియన్లకు అలవాటే. తెలంగాణలో లేటెస్ట్‌గా ఆగ్రహ జ్వాలలు చెలరేగి.. సెంటిమంటల్ని రాజేస్తోంది అటువంటిదే ఒక విగ్రహ వివాదం. సచివాలయం ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతోంది విపక్ష బీఆర్ఎస్. మన తెలంగాణకు రాజీవ్ ఏమవుతాడు అని వాళ్లు నిలదీస్తుంటే.. అడగడానికి నువ్వెవరు అని నిగ్గదీస్తోంది కాంగ్రెస్ పార్టీ. చెప్పు తెగుద్ది అంటూ రేవంత్‌రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో విగ్రహ దుమారం పొలిటికల్ తుఫాన్‌గా మారింది.

దేశవ్యాప్తంగా రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోమాజిగూడలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి అంజలి ఘటించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయనతో పాటు దీపాదాస్ మున్షి, వీహెచ్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ చేసిన ప్రసంగంలో సచివాలయం ఆవరణలో రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటు ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పటికే ఈ అంశంపై ముందస్తుగా కౌంటర్లిచ్చి కాక మీదుంది బీఆర్‌ఎస్ పార్టీ. తెలంగాణ అస్తిత్వంతో ఆడుకుంటే ఊరుకునేది లేదు అని కేటీఆర్ చేసిన కామెంట్లకు.. ఘాటుగా కౌంటరిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలన్న ఉద్దేశంతోనే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని కేటీఆర్‌పై వెర్బల్ ఎటాక్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య డైలాగ్‌వార్‌ వేడెక్కింది.

వేలాది కోట్లు దోచుకుని, వందలాది ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న వాళ్ల విగ్రహాల కంటే.. దేశం కోసం అమరుడైన రాజీవ్‌గాంధీ విగ్రహమే మేలన్నది కాంగ్రెస్ వాదన. తెలంగాణ తల్లిని అగౌరవపరిచి.. రాష్ట్రానికి సంబంధం లేని రాజీవ్‌గాంధీ విగ్రహం పెడితే ఊరుకునేది లేదని.. ఇంతకింతా తీర్చుకుంటామని బీఆర్‌ఎస్ మండిపడుతోంది. సెంటిమెంట్‌ టచ్చవుతోందన్న స్మెల్ రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఉలిక్కిపడింది.. మేలుకుంది. అదే సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదంటూ సన్నాసి భాషతో కౌంటర్లిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన రానివాళ్లు.. ఇప్పుడొచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు రేవంత్‌రెడ్డి. రాజీవ్‌గాంధీ విగ్రహం తొలగించి.. అ స్థలంలో ఏ విగ్రహం పెట్టాలో కూడా ఆలోచిస్తాం.. అంటూ మరో అడుగు ముందుకేసింది బీఆర్ఎస్. తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకోవడం.. టోటల్ తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించినట్టే అంటూ విమెన్ సెంటిమెంట్‌ను కూడా రాజేసింది బీఆర్ఎస్..

వీడియో చూడండి..

ఢిల్లీకి గులాంగిరీ.. అంటూ కేటీఆర్ ఫైర్..

విగ్రహ వివాదం ఇక్కడితో ఆగిందని ఊపిరి పీల్చుకుంటుండగానే.. సోషల్ మీడియా ద్వారా కంటిన్యూ చేశారు కేటీఆర్. ఢిల్లీకి గులాంగిరీ చేసే మీలాంటివారు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేరు.. స్కూల్‌ పిల్లల ముందు మీరు మాట్లాడిన తీరు.. మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అని సున్నితంగా చెబుతూనే.. కేటీఆర్ చేసిన మరో కామెంట్ ఆసక్తికరంగా మారింది. మేం అధికారంలోకి వచ్చిన తొలిరోజే.. అంబేద్కర్‌ విగ్రహం, సచివాలయం పరిసరాల్లో ఉండే చెత్తనంతా తొలగిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కొత్త దుమారం రేగుతోంది. సెక్రటేరియట్‌కి అటూ ఇటూ ఏమేం ఉన్నాయ్.. దేన్ని ఉద్దేశించి కేటీఆర్ చెత్త అంటున్నారు… అనే చర్చ మొదలైంది.

డిసెంబర్‌ 9లోగా తెలంగాణ తల్లి విగ్రహం..

డిసెంబర్‌ 9లోగా సచివాలయంలో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్న రేవంత్‌రెడ్డి.. సచివాలయ ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అటు.. రాజీవ్‌ గాంధీ విగ్రహం నెలకొల్పే ప్రాంగణాన్ని కూడా అంతకుముందే పరిశీలించి.. ల్యాండ్‌ స్కేపింగ్‌, ఇతర పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రేవంత్ ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ గీతం, తెలంగాణ రాజముద్రల్లో మార్పులపై రాజకీయ దుమారం రేగింది. సోనియాగాంధీ ఫేస్‌కటింగ్స్‌తో తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం.. వీటన్నిటితో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు రాజీవ్‌విగ్రహం వర్సెస్ తెలంగాణ తల్లి విగ్రహం అనే రగడ.. టీ-పాలిటిక్స్‌ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..