
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైందని కొంతమంది చేస్తున్న ప్రచారాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఖండించారు. ఈసీపై దుష్ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు. పోలింగ్ శాతాలతో పాటు పలుచోట్ల ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. కానీ కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
పోలింగ్ పూర్తైన వెంటనే సాయంత్రం 5 గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తరువాతి రోజు మాత్రమే పోలింగ్ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని ఆయన పేర్కొన్నారు. జగిత్యాలలో ఆటోలో తరలించిన ఈవీఎంలు శిక్షణ కోసం వినియోగించినవేనని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అసత్యాలు ప్రచారం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన విఙ్ఞప్తి చేశారు.