
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో సమతాకుంభ్–2026 కార్యక్రమాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ నగరం సమతా మూర్తి ప్రాంగణంలో ఘనంగా శాంతి కల్యాణోత్సవం జరుగుతుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఒకే ముహూర్తాన 108 భగవాన్ మూర్తులకు శాస్త్రోక్తంగా శాంతి కల్యాణం జరిపారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జేజేల మధ్య అంగరంగ వైభవంగా సాగిన ఈ వేడుక సమతాకుంభ్–2026లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముచ్చింతల్లో జరుగుతున్న శాంతి కల్యాణోత్సవాన్ని లైవ్లో చూడండి..
5వ తేదీన 7వ రోజు వసంతోత్సవం, సాయత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ జరుగుతుంది. ఫిబ్రవరి 6న 8వ రోజు సామూహిక లక్ష్మీ పూజ, గద్యత్రయ పారాయణం, సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ వాహన సేవ ఉంటుంది. ఫిబ్రవరి 7న సువర్ణ రామానుజులకు 108 దివ్యదేశాల మర్యాద సమర్పణలో భాగంగా ఆచార్య వరివస్య కార్యక్రమం, తెప్పోత్సవం కొనసాగనుంది. ఫిబ్రవరి 8న శ్రీ రామానుజుచార్యులకి రథోత్సవం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9.. చివరి రోజున శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహా పూర్ణాహుతి కార్యక్రమాలతో ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో శ్రీరామానుజుచార్యుల 4వ బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 13 వరకు 108 దివ్యదేశమూర్తులకు ఉత్సవాస్త స్నపనం జరగనుంది.