పరేడ్ గ్రౌండ్స్ గేట్ నంబర్ 3 వద్ద వీఐపీల తాకిడి పెరిగింది. కార్యవర్గ సమావేశాలు ముగియడంతో.. అగ్ర నాయకులు పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటున్నారు. ఈ సభ కోసం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లోపల 1200 మంది పోలీస్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయగా.. బయట 4000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోదీతోపాటు పలువురు కీలక నేతలు హాజరువుతుండటంతో.. 350 సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచారు. బీజేపీ సభకు వరుణుడి ముప్పుగా మారాడు. హైదరాబాద్లో వర్షం మొదలైంది. పరేడ్ గ్రౌండ్స్లో జోరువాన పడుతుంది. వర్షం కారణంగా నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు టెంట్లు కిందకు వెళ్లగా.. మరికొందరు కుర్చీలను తలపై పెట్టుకుని తడవకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బేగంబజార్, ఎంజే మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, హిమాయత్నగర్, నారాయణగూడ, లిబర్టీ, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈదురు గాలులు వీయడంతో సభాస్థలికి చేరుకోడానికి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. సభా ప్రాంగణంలో రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరారు. పరేడ్ గ్రౌండ్స్ సభలో సభా వేదికపై ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కొండా చేయి పట్టుకుని అభివాదం చేయించారు తరుణ్చుగ్.