Hyderabad Metro: ఇక మెట్రో రైలు ప్రయాణమూ భారమే.. కొత్త సంవత్సరం నుంచే నూతన ఛార్జీలు..
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఎల్బీ నగర్ - మియాపూర్, రాయదుర్గం - నాగోల్, ఎంజీబీఎస్ - జేబీఎస్ మార్గాల్లో..
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఎల్బీ నగర్ – మియాపూర్, రాయదుర్గం – నాగోల్, ఎంజీబీఎస్ – జేబీఎస్ మార్గాల్లో సర్వీసులు అందిస్తు్న్నాయి. కరోనా కారణంగా కొన్ని రోజులు నిలిచిపోయిన మెట్రో.. తిరిగి పునర్ వైభవాన్ని సంతరించుకుంటోంది. మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఇందుకు నిదర్శనంగా మారుతోంది. అయితే మెట్రో సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మెట్రో రైలు ఛార్జీలను సవరించలేదు. ఈ మేరకు ఛార్జీలు సవరించేందుకు మెట్రో అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అందజేసేందుకు ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన గడువు రేపు (మంగళవారం)తో ముగియనుంది. ఇప్పటికే పలు సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీల నుంచి కమిటీకి పోస్టల్, మెయిల్ ద్వారా లేఖలు అందుతున్నాయి. వీటిని కమిటీ ముందే తెరవనున్నారు.
హైదరాబాద్లో మెట్రో రైలు సేవలు ప్రారంభమై ఈ నెలతో ఐదేళ్లు కావొస్తున్నాయి. దీంతో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ, రాష్ట్రం అభ్యర్థన మేరకు కేంద్రం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. అక్టోబర్ నెలాఖరులో హైదరాబాద్లో సమావేశమైన ఈ కమిటీ.. ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15వ తేదీలోగా తెలపాలని ఓ ప్రకటనలో కోరింది. ఈ మొత్తం ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే మెట్రో.. ప్రారంభమైనప్పటి నుంచి ఒకటే ఛార్జీలు అమలవుతున్నాయి. దీంతో ఛార్జీలను సవరించే తరుణం వచ్చిందంటున్నారు ఎల్ అండ్ టీ అధికారులు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఛార్జీల పెరుగుదల ఉండనుంది. మెట్రో ఛార్జీలు పెరిగితే ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే అందుకు తగినట్లే రాయితీలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..