Mynampalli Hanumantha Rao Profile: టీడీపీ టూ కాంగ్రెస్.. వయా బీఆర్ఎస్.. మైనంపల్లి రాజకీయ ప్రస్థానం ఇదిగో..

|

Dec 02, 2023 | 12:50 PM

Mynampalli Hanumantha Rao Telangana Election 2023: హైదరాబాద్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరు మైనంపల్లి హన్మంతరావు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన.. 2018లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మెదక్ జిల్లా కొర్విపల్లి గ్రామంలో జన్మించిన మైనంపల్లి.. 1992లో యూఎస్‌లోని అలబామా యూనివర్సిటీ నుంచి బీఏలో డిగ్రీ పట్టా పొందారు.

Mynampalli Hanumantha Rao Profile: టీడీపీ టూ కాంగ్రెస్.. వయా బీఆర్ఎస్.. మైనంపల్లి రాజకీయ ప్రస్థానం ఇదిగో..
Mynampalli
Follow us on

Mynampalli Hanumantha Rao Telangana Election 2023: హైదరాబాద్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరు మైనంపల్లి హన్మంతరావు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన.. 2018లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మెదక్ జిల్లా కొర్విపల్లి గ్రామంలో జన్మించిన మైనంపల్లి.. 1992లో యూఎస్‌లోని అలబామా యూనివర్సిటీ నుంచి బీఏలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మైనంపల్లి హన్మంతురావు.. ఆ తర్వాత బీఆర్ఎస్.. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. అలాగే ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.

టీడీపీ టూ కాంగ్రెస్.. వయా బీఆర్ఎస్..

1998లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మైనంపల్లి హన్మంతరావు. 2008 జరిగిన ఉపఎన్నికలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2009 జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన శశిధర్ రెడ్డిపై 21,151 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు మైనంపల్లి. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హన్మంతరావు మల్కాజ్‌గిరి నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశించారు. అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ పొత్తుతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో నిరాశ చెందిన ఆయన 2014 ఏప్రిల్ 6న టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో.. రెండు రోజుల తర్వాత 8 ఏప్రిల్, 2014న తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీలో చేరారు. అనంతరం టీఆర్ఎస్ తరపున 2014 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. అప్పటి టీడీపీ అభ్యర్థి సి.హెచ్. మల్లారెడ్డి చేతుల్లో 28,371 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 21 ఏప్రిల్ 2015లో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మైనంపల్లి హన్మంతురావు. 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మైనంపల్లి హన్మంతరావు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇదిలా ఉండగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు తనకు మల్కాజ్‌గిరి టికెట్‌ను, కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశారు. అయితే 2023 ఆగష్టు 21న సీఎం కేసీఆర్ ప్రకటించిన తొలి అభ్యర్ధుల జాబితాలో కేవలం ఒక్క టికెట్ మాత్రమే బీఆర్ఎస్ కేటాయించడంతో.. మంత్రి హరీష్‌రావుపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు మైనంపల్లి. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుని షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అనంతరం మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి.. 2023 సెప్టెంబర్ 22న రాజీనామా చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28న ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మైనంపల్లి. కాగా, అక్టోబర్ 15న కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేయగా.. అందులో మైనంపల్లికి, ఆయన కుమారుడికి టికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి

కాగా, తన ఓటు హక్కును వినియోగించుకున్న మైనంపల్లి హన్మంతరావు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..