
హైదరాబాద్ నగరంలో ఓ మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బాలిక తండ్రి రఫీక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. 12 ఏళ్ల నజియా అనే బాలిక మిస్సింగ్ అయినట్లు నమోదు చేసి, లుక్అవుట్ నోటీసు జారీ చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో కీలక మలుపు తిరిగింది.
చంద్రాయణగుట్ట పోలీసులకు బాలాపూర్ సమీపంలోని ఒక నాలాలో ఓ బాలిక పడిఉన్నట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ గోపి తన బృందంతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని గమనించి వెంటనే బాలికను రక్షించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ ప్రాథమిక సహాయం అందించారు. ఆ తర్వాత ఈ సమాచారం సంతోష్ నగర్ పోలీసులకు చేరవేయగా, అది మిస్సింగ్ అయిన నజియానే అని నిర్ధారించారు. వెంటనే బాలిక తండ్రి రఫీక్కు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో సామాజిక సేవలో భాగంగా పనిచేస్తున్న నారి నికేతన్ ఫౌండేషన్ ఓనర్ సఫియా మహిని కూడా అక్కడికి పిలిచారు. ఆమె అక్కడికి చేరుకుని బాలికను శుభ్రపరచించి, కౌన్సెలింగ్ అందించారు. బాలిక మానసిక స్థితిని కూడా పరిశీలించి ఆమెను ఓదార్చారు. అనంతరం పోలీసులు, ఇన్స్పెక్టర్ గోపి సమక్షంలో బాలికను తండ్రి రఫీక్కు అప్పగించారు. కుమార్తె సురక్షితంగా తిరిగి లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు చూపిన అప్రమత్తత, వేగవంతమైన స్పందన ప్రశంసలు అందుకుంటోంది. ఒక మిస్సింగ్ కేసును తక్షణమే పరిష్కరించి బాలికను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించడం పోలీసుల సమర్థతను మరోసారి చాటిచెప్పింది.