
ఇళ్ల పండుగ షురూ కానుంది.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ సెక్రటేరియేట్లో.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీని జూన్ 1న సిర్పూర్ కాగజ్నగర్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇళ్లు కేటాయించనున్నారు. నియోజకవర్గంలో 1,500 మంది స్థలాలున్న వారికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయనున్నారు. దీంతోపాటు.. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2వ తేదీ నాటికి దాదాపు లక్ష గృహ ప్రవేశాలు జరగాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. పూరిగుడిసెలు లేని విధంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని 24 నియోజకవర్గాల పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 14వేల 800 పూరి గుడిసెలు ఉన్నట్లు గుర్తించామని.. రెండో విడతలో వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. స్థలాలు ఉన్న 18వేల 500 మందికి ఈ నెలాఖరు వరకు ప్రొసీడింగ్స్ ఇస్తామని తెలిపారు.
దీంతోపాటు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, శ్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు.. గోడలు పూర్తయి శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప్పున అందించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..