
హైదరాబాద్ నగరంలో నాటుకోడి (కంట్రీ చికెన్) డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా నాటుకోడిని ఇష్టపడుతుండగా, వీకెండ్స్లో సేల్స్ రెట్టింపవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే శని, ఆదివారాల్లో నాటుకోడి కోసం నగరవాసులు మార్కెట్లకు పోటెత్తుతున్నారు. నాటుకోడిని ప్రజలు ఎక్కువగా ఇష్టపడటానికి పలు కారణాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది సహాయపడుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అంతేకాకుండా, దీని రుచి, సంప్రదాయ ప్రాముఖ్యత కూడా డిమాండ్కు దోహదపడుతున్నాయి. నగరవాసులు ఎప్పటి నుంచో నాటుకోడిని తింటున్నప్పటికీ, గత కొంతకాలంగా వినియోగం మరింత పెరిగింది. తమ పిల్లలు కూడా నాటుకోడి కూరనే ఇష్టపడుతున్నారని పలువురు పేరెంట్స్ చెబుతున్నారు. కంట్రీ చికెన్ సహజసిద్ధంగా పెరగడం, యాంటీ బయోటిక్స్ లేకుండా ప్రోటీన్ అందిస్తుందని, ముఖ్యంగా పిల్లలకు, ఆడపిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారమని వినియోగదారులు పేర్కొంటున్నారు.
గతంలో నాటుకోళ్ల పెంపకం కొంతమందికే పరిమితం కాగా, ప్రస్తుతం చాలా మంది నాటుకోళ్లను పెంచుతున్నారు. దీని వల్ల నాటుకోడి లభ్యత కూడా పెరిగింది. నగరంలోని ఎర్రగడ్డ, కేపీహెచ్బీ, మియాపూర్, రాంనగర్, అంబర్పేట్, మేడ్చల్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో నాటుకోళ్లు ఎక్కువగా లభిస్తున్నాయి. కొనుగోలుదారులు వివిధ ప్రాంతాలకు వెళ్లి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. కోళ్ల బరువు, అవి పెరిగిన ప్రాంతాన్ని బట్టి ధరలు ఉంటాయని అమ్మేవాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం నాటుకోడి మాంసం కిలోకు రూ.650 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. ఈ అధిక ధర ఉన్నప్పటికీ, నాటుకోడి వినియోగం కొనసాగుతోంది. నాటుకోడి ప్రస్తుతం ఆన్లైన్లో కూడా అందుబాటులోకి వచ్చింది. పలు సంస్థలు నాణ్యమైన నాటుకోడి, కడక్నాథ్, పందెం కోడి వంటి రకాలను నేరుగా ఇంటికే అందిస్తున్నాయి. భవిష్యత్తులో క్విక్ కామర్స్ యాప్లలో కూడా నాటుకోడి ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చి, మరింత మంది కస్టమర్లకు డోర్ డెలివరీ చేయాలని సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి. కడక్నాథ్, విలేజ్ కంట్రీ చికెన్, ఆర్గానిక్ ఎగ్స్ వంటి విభిన్న రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
Also Read: కొత్తిమీర ఇంటి వద్ద కట్టలు కట్టలుగా రావాలంటే ఇలా చేయండి..