Hyderabad: ఇష్టంగా తిన్న మోమోస్‌ ఆమె ఉసురు తీశాయి.. మరో 50 మంది..

|

Oct 28, 2024 | 3:22 PM

హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. మోమోస్‌ తిని మహిళ మృతి చెందింది. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పీఎస్‌ పరిధిలో వెలుగుచూసింది. డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Hyderabad: ఇష్టంగా తిన్న మోమోస్‌ ఆమె ఉసురు తీశాయి.. మరో 50 మంది..
Reshma - Momo's
Follow us on

బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్ట్రీట్ ఫుడ్ తిని ఓ మహిళ మృతి చెందింది. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రతీ వారంలాగే ఈ వారం కూడా నందినగర్‌లో మార్కె‌ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మోమోస్‌ను పలువురు ఇష్టంగా కొనుక్కుని తిన్నారు. మోమూస్‌ను ఇష్టంగా తిని ఇంటికి వెళ్లిన తర్వాత హఠాత్తుగా వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అనారోగ్యానికి గురైనవారిని కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రులకు తరలించారు. సుమారు 50 మంది అస్వస్థతకు లోనైనట్లు సమాచారం.

మోమోస్‌ తినడంతో సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ అనే 29 ఏళ్ల మహిళ కూడా అస్వస్థతకు గురవడంతో కుటుంబీకులు ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్ట్రీట్ ఫుడ్ తిని రేష్మ మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై చాలా మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మోమోస్‌ తిన్నవారిలో దాదాపు 10 మంది మైనర్లు ఉన్నట్లు తెలిసింది.

బాధితులు చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోమోస్ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే మోముస్‌ను ఎలా తయారు చేశారు.. ఇందులో ఏమైనా కలిసిందా.. లేక మోముస్ తయారీలో ఏమైనా నాసిరక పదార్థాలు ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి