
హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్. ఐటీ కారిడార్లో నివాసం ఉండేవారితో పాటు ఉద్యోగం రీత్యా అటువైపు వెళ్లేవారికి ఇది ఎగిరి గంతేసే వార్త అని చెప్పవచ్చు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ హబ్గా ప్రసిద్ది పొందిన రాయదుర్గంలో అత్యాధునిక స్ట్రీట్ ఫుడ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీనిని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దీని ఏర్పాటుకు సంబంధించి పనులు మొదలుపెట్టారు. దీంతో త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దీనిని అభివృద్ది చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డిజైన్కు రూపకల్పన చేశారు. ఐటీ హబ్లో ఈ స్ట్రీట్ ఫుడ్ హబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ స్ట్రీట్ ఫుడ్ హబ్లో దాదాపు 50కిపైగా స్టాల్స్ ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలతో పాటు శుభ్రమైన ఆహ్లాదకర వాతావరణం, తెలంగాణ సంస్కృతిని తెలిపేలా కళా ప్రదర్శనలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేవారు ఆహ్లాదకర వాతావరణంలో ఫుడ్ను ఆస్వాదించవచ్చు. ఆధునిక సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఫుడ్ స్ట్రీట్ కోసం రూ.4 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. పరిపాలనా అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్ట్రీట్లో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. సాంప్రదాయ వంటకాలతో పాటు ఇతర వంటకాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ కూర్చుని తినే సౌకర్యంతో పాటు పార్కింగ్ సదుపాయం కూడా కల్పించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఫుడ్ లవర్స్కు పండుగే అని చెప్పవచ్చు. ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ఇకపై రుచుల కేంద్రంగా కూడా మారనుందని చెప్పవచ్చు.
తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ వంటకాలు ఈ స్ట్రీట్ ఫుడ్ హబ్లో లభిస్తాయి. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ స్ట్రీట్ ఫుడ్ బాధ్యతలను అప్పగించనున్నారు. మహిళలకు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో మహిళలకు ఉపాధి కలగనుంది. వారికి దీని వల్ల స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఇక జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఇక్కడ నిర్వహిస్తారు. ఫుడ్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా పొందవచ్చు. పట్టణ ప్రజల అభిరుచికి అనుగుణంగా ఆహారం, ఉపాధి, సంస్కృతి, పర్యాటకం అనే నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ స్ట్రీట్ ఫుడ్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ కారిడార్లో ఇది ఒక ప్రధాన కేంద్రంగా మారనుందని చెప్పవచ్చు.