HCU Lands Row: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ విషయంలో..

కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌, యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని.. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి పొలీసులను వెనక్కి పిలవాలని.. నిషేదాజ్ఞలు ఎత్తివేయాలని టీచర్స్ అసోసియేషన్స్‌, సివిల్ సొసైట్ సభ్యులు కోరారు.

HCU Lands Row: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ విషయంలో..
Cm Revanth Reddy

Updated on: Apr 08, 2025 | 7:28 AM

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీయూ విద్యార్థులపై నమోదైన కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఏఐ ఆధారంగా వీడియోలు పోస్ట్‌లు చేసిన వాళ్లకు నోటీసులిస్తున్నారు పోలీసులు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులిచ్చారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏఐ టెక్నాలజీతో సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పోస్ట్‌ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో విచారణకు రావాలని సూచించారు. ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ కావడంతో చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. వాస్తవాలు బయటకు రాకముందే ఫేక్ వీడియోలతో అబద్ధాలు వైరల్ కావడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎవరెవరు తమ అకౌంట్లలో వీడియోలు పోస్ట్‌ చేశారో వాళ్ల వివరాలను సేకరిస్తున్నారు. త్వరలో మరికొంతమంది నేతలకు పోలీసులు నోటీసులిస్తారని తెలుస్తోంది.

కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌, యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని.. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి పొలీసులను వెనక్కి పిలవాలని.. నిషేదాజ్ఞలు ఎత్తివేయాలని టీచర్స్ అసోసియేషన్స్‌, సివిల్ సొసైట్ సభ్యులు కోరారు. ఈ విజ్ఞప్తితో విద్యార్థులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థుల కేసుల ఉపసంహరణకు కూడా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీచేశారు. HCU నుంచి పోలీసు బలగాల ఉపసంహరణపై వీసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖ రాశారు.

విచారణ 24కి వాయిదా..

ఇక కంచ గచ్చిబౌలి భూములపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున 24లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. మరోవైపు స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఏఎస్‌జీ ప్రవీణ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ప్రభుత్వ న్యాయవాది ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..