Dattatreya Meets Chiranjeevi: రేపే అలయ్ బలయ్‌.. మెగాస్టార్ చిరంజీవితో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ భేటీ.. చీఫ్ గెస్ట్‌గా..

|

Oct 05, 2022 | 6:39 PM

నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో నిర్వహిస్తామని అలయ్‌‌ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్‌‌ విజయలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని బుధవారం తెలిపారు.

Dattatreya Meets Chiranjeevi: రేపే అలయ్ బలయ్‌.. మెగాస్టార్ చిరంజీవితో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ భేటీ.. చీఫ్ గెస్ట్‌గా..
Dattatreya Chiranjeevi
Follow us on

దసరా తర్వాతి రోజు గురువారం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో నిర్వహిస్తామని అలయ్‌‌ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్‌‌ విజయలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయనను హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ.. చిరంజీవిని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. చిరంజీవి నివాసంలో దత్తాత్రేయ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిని సన్మానించాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. అందుకే ఆయనను రేపటి కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చానని దత్తాత్రేయ తెలిపారు.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్‌-బలయ్‌ కార్యక్రమాన్ని దాదాపు 17 ఏళ్ల నుంచి బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికోసం ఇప్పటికే.. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు అలయ్ బలయ్ కమిటీ ఛైర్మన్ విజయలక్ష్మీ ఇప్పటికే తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడా, సాహిత్య, సాంస్కృతిక రంగ ప్రముఖులను ఘనంగా సత్కరించనన్నారు. దీనికోసం ఇప్పటికే ఆహ్వానాలు సైతం పంపించారు.

ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, జి. కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, భగవత్ మాన్ సింగ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మెహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..