లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు.. బీఆర్ఎస్‌కు చెక్‌పెట్టే దిశగా ప్రణాళికలు..

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న పీసీసీ నేతలు.. గ్రౌండ్‌ లెవల్లోనూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే 10 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కు షాక్‌ తగిలింది. మరో 18 మున్సిపాలిటీల్లోనూ అదే సీన్‌ రిపీట్‌ అయ్యే ఛాన్సుంది.

లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు.. బీఆర్ఎస్‌కు చెక్‌పెట్టే దిశగా ప్రణాళికలు..
Congress Party

Updated on: Jan 24, 2024 | 12:45 PM

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న పీసీసీ నేతలు.. గ్రౌండ్‌ లెవల్లోనూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే 10 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కు షాక్‌ తగిలింది. మరో 18 మున్సిపాలిటీల్లోనూ అదే సీన్‌ రిపీట్‌ అయ్యే ఛాన్సుంది.

లోక్‌సభ ఎన్నికల్లో 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది. ఓవైపు ఆరు గ్యారెంటీలను అస్త్రంగా భావిస్తోన్న హస్తం పార్టీ.. వాటి అమలు దిశగా వ్యూహాలు రచిస్తోంది. 10 రోజుల పాటు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. డేటా ఎంట్రీ ప్రక్రియ ముగియగానే అమలుపై ఫోకస్‌ పెట్టనుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు హామీలు అమల్లోకి వచ్చాయి. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేయాలని డిసైడ్ చేశారు.

మరోవైపు రాష్ట్రంలో అధికారం మారడంతో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌ లోకల్‌ లీడర్లు కాంగ్రెస్‌కు జై కొడుతూ.. సొంత పార్టీ నేతలపైనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. పలు చోట్ల బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతోంది.

అవిశ్వాస తీర్మానాలతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. 8 ఉమ్మడి జిల్లాల్లోని మొత్తం 28 మున్సిపాలిటీల్లో ఆదిలాబాద్‌లో 4, మెదక్‌లో 2, నల్గొండలో 3, నిజామాబాద్‌లో ఒక చోట అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఈ పది మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి. మరో 18 మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి నోటీసులివ్వగా.. వచ్చే నెలలో వాటిపై స్పష్టత రానుంది. అవి కూడా కాంగ్రెస్‌ పార్టీనే నెగ్గే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ దూకుడు కొనసాగిస్తుంటే.. బీఆర్ఎస్‌ మాత్రం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ కార్యకర్తల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంది. వచ్చే నెలలో అసెంబ్లీ నియోజకవర్గాలపై రివ్యూ చేయాలని బీఆర్ఎస్‌ పెద్దలు నిర్ణయించారు.