Drug Free India: అలర్ట్.. డ్రగ్స్, గంజాయ్ గురించి తెలిస్తే 1908కి సమాచారం ఇవ్వండి.. క్షణాల్లోనే..

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి చట్ట అమలు సంస్థలు, విద్యాసంస్థలు, సమాజం, పౌరులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. Telangana Eagle Force చేపడుతున్న చర్యలు, టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1908 ద్వారా అందుతున్న సమాచారంతో డ్రగ్స్ నెట్‌వర్క్‌లను గుర్తించి నిర్మూలిస్తున్నట్లు తెలిపారు.

Drug Free India: అలర్ట్.. డ్రగ్స్, గంజాయ్ గురించి తెలిస్తే 1908కి సమాచారం ఇవ్వండి.. క్షణాల్లోనే..
Nasha Mukt Bharat Abhiyan

Updated on: Jul 08, 2026 | 4:29 PM

మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనకు చట్టాన్ని అమలు సంస్థలు, విద్యాసంస్థలు, సమాజం, పౌరులు సమన్వయంతో ముందుకు సాగాల‌ని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ సమగ్ర అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, సమష్టి కృషితోనే ఈ పోరాటంలో విజయం సాధించగలమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు. నిరంతర నిఘాతో పాటు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1908 ద్వారా ప్రజలు అందిస్తున్న సమాచారం రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నెట్‌వర్క్‌లను గుర్తించడానికి, వాటిని నిర్మూలించడానికి ఎంతగానో దోహదపడుతోందని శ్రీనివాసరావు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా దేశ యువతకు పెద్ద ముప్పుగా మారిందని, నిందితులు ముఖ్యంగా విద్యార్థులను, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు విద్యార్థులలో, ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఏవరైనా విక్రయిస్తున్నా.. లేదా తీసుకుంటున్నా.. సమాచారం ఇవ్వాలని సూచించారు.

నషా ముక్త్ భారత్ అభియాన్ మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి పనిచేస్తుందని శ్రీనివాసరావు వివరించారు. డ్రగ్స్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడం, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, వ్యసనపరులకు విముక్తి కలిగించి పునరావాసం కల్పించడం ఇందులో ప్రధానమైనవని పేర్కొన్నారు. మాదకద్రవ్య రహిత భారత స్వప్నాన్ని సాకారం చేసేందుకు పౌరులంతా అప్రమత్తంగా ఉంటూ, డ్రగ్స్ వ్యతిరేక చ‌ర్య‌ల‌కు చురుగ్గా మద్దతు ఇవ్వాలని కోరారు.

అంతకుముందు పీఐబీ, సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కట్టుబడి ఉందని చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ఆరోగ్యకరమైన, సురక్షితమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. అవగాహన, నివారణ, సరైన నిర్ణయాలు తీసుకోవడమే డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గాలని ఆమె పేర్కొన్నారు. వ్యసనంతో పోరాడుతున్న వారికి అండగా నిలిచి, వారు గౌరవప్రదంగా తిరిగి సమాజంలో కలిసిపోయేలా సహాయం చేయాల్సిన ప్రాధాన్యతను ఆమె గుర్తుచేశారు.

Drug Free Society

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విద్యాసంస్థల సీఈఓ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. ఆన్‌లైన్, సైబర్ నేరాలతో పాటు డ్రగ్స్ వ్యసనం నేడు యువతకు, కుటుంబాలకు, దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, బలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని, తోటివారిలో కూడా అవగాహన పెంచాలని ఆయన కోరారు.

ఈ ప్రచారంలో అందరూ చురుగ్గా పాల్గొని, ఇక్కడ తెలుసుకున్న విషయాలను తమ కుటుంబాలకు, సమాజానికి చేరవేయాలని వ‌క్త‌లు కోరారు. తద్వారా నషా ముక్త్ భారత్ నిర్మాణ సమష్టి కృషిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విద్యాసంస్థల ఎవాల్యువేష‌న్‌ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మట్టా, అధ్యాపకులు, విద్యార్థులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us