నోటు కొట్టినోడికే చోటు.. ఒక్కో టోర్నీకి ఒక్కో రేటు.. హెచ్‌సీయూలో అవినీతిపై దృష్టిపెట్టిన ఏసీబీ

|

Jul 31, 2024 | 9:00 PM

క్రికెటర్‌ కావాలని, టీమిండియాకి ఎంపిక కావాలని, భారత్‌ తరపున ఆడాలని, అహర్నిశలు కష్టపడుతూ కలలుగనే యువకులెందరో! రంజీ ప్లేయర్‌ అవ్వాలనో, బీసీసీఐ లీగ్స్‌లో ఆడాలనో శ్రమించేవాళ్లు ఇంకెందరో!. కనీసం డివిజన్‌ లీగ్స్‌లో అయినా ఆడాలని ఒళ్లు హూనం చేసుకుంటున్న యువత ఎంతోమంది.

నోటు కొట్టినోడికే చోటు.. ఒక్కో టోర్నీకి ఒక్కో రేటు.. హెచ్‌సీయూలో అవినీతిపై దృష్టిపెట్టిన ఏసీబీ
Hca
Follow us on

క్రికెటర్‌ కావాలని, టీమిండియాకి ఎంపిక కావాలని, భారత్‌ తరపున ఆడాలని, అహర్నిశలు కష్టపడుతూ కలలుగనే యువకులెందరో! రంజీ ప్లేయర్‌ అవ్వాలనో, బీసీసీఐ లీగ్స్‌లో ఆడాలనో శ్రమించేవాళ్లు ఇంకెందరో!. కనీసం డివిజన్‌ లీగ్స్‌లో అయినా ఆడాలని ఒళ్లు హూనం చేసుకుంటున్న యువత ఎంతోమంది. వీళ్లందరి ఆశలపై నీళ్లు జల్లుతూ..వాళ్ల క్రికెట్‌ జీవితానికే చరమ గీతం పాడుతున్నారు..కొంతమంది పెద్దలు. కష్టపడి శ్రమించినవాళ్లను కాదని..కాసులు వెదజల్లేవాళ్లనే క్రికెటర్లగా మార్చేస్తున్నారు.

దేశానికి గతంలో అద్భుతమైన క్రికెటర్లను అందించిన హైదరాబాద్‌..ఇప్పుడు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. పరుగులు చేయకపోయినా ఫర్వాలేదు..వికెట్లు తీయకపోయినా నష్టం లేదు, లాబీతో పరిచయాలుండి వాళ్లు అడిగినంత డబ్బిస్తే చాలు ఏ టోర్నీలోనైనా ఆడేయవచ్చు. ప్రతి దానికీ ఓ రేటు ఫిక్స్‌చేసి అమ్మేసుకుంటున్నారనే టాక్‌ రీసౌండ్ వస్తోంది. ఎవరు ఎక్కువ డబ్బులు ముట్టచెబితే వాళ్లకే అవకాశాలు దక్కుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వ్యవహారంపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు..అవినీతి తీగ లాగే పని ప్రారంభించారు. 2022లో నమోదైన కేసుపై.. HCA కార్యాలయంలో తాజాగా సోదాలు నిర్వహించారు.

2022లో తన క్లబ్ నుండి ఆడించేందుకు ప్లేయర్ నుండి డబ్బులు డిమాండ్ చేశారు..కాంటినెంటల్ క్రికెట్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ పట్టాభి శ్రీనివాస్. అండర్-19 లో ఆడించేందుకు ఓ ప్లేయర్‌ తండ్రి నుండి..9 లక్షలు లంచం తీసుకున్నారు. అయితే ఇంత మొత్తంలో డబ్బు చెల్లించినా కూడా..తన కుమారుడిని తుది జట్టులో ఆడించకపోవడంతో బాధితుడు తండ్రి..ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అప్పట్లోనే కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టాభి శ్రీనివాస్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతో పాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌సీఏలో నాటి పరిస్థితుల కారణంగా ఈ కేసు ముందుకు సాగలేదు. అయితే గత ఏడాది అధ్యక్ష పదవిలోకి వచ్చిన జగన్ మోహన్ రావ్ నేతృత్వంలో..ఆఫీస్ బ్యారర్స్ అంతా ఒకే మాటపై ఉన్నారు. దీంతో అవినీతి కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు..ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులకు..అవసరమైన సమాచారం అందించారు సభ్యులు.

HCAలో ఆట తక్కువ-అవినీతి ఎక్కువన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిభకు పాతరేసి నోట్ల కట్టలకు హెచ్‌సీఏ జట్టులోని స్థానాలను అమ్ముకుంటున్న కొందరు చీడ పురుగుల వల్ల..నైపుణ్యాలు గల పేద క్రీడాకారులకు అన్యాయం జరుగుతోంది. డివిజన్‌ లీగ్‌ల్లో సెంచరీల మోత మోగించినా..పదుల సంఖ్యలో వికెట్లు పడగొట్టినా, సెలెక్షన్స్‌ దగ్గరికొచ్చే సరికి బేరసారాలు చేస్తున్నారని పలువురు వర్ధమాన క్రికెటర్లు వాపోతున్నారు. ఈ ఆరోపణలపై ఏసీబీ అధికారులు తీగ లాగితే..అవినీతి డొంక కదిలే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఒకప్పుడు దేశానికే నాయకత్వం వహించిన టాప్‌ క్రికెటర్లను అందించిన HCAను..మళ్లీ గాడిలో పెడుతుందా? చూడాలి.