Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఈ రూట్లో వెళ్లేవారికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.. ప్రారంభం ఎప్పుడంటే..?

హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది దసరా నాటికే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే ఎప్పుడు పనులు పూర్తవుతాయనే విషయంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఈ రూట్లో వెళ్లేవారికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.. ప్రారంభం ఎప్పుడంటే..?
Uppal Flyover

Edited By:

Updated on: Sep 11, 2026 | 12:55 PM

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల వాహనదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను వేగవంతం చేసి, 2027 జూన్‌ నాటికి ఫ్లైఓవర్‌ను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉప్పల్‌–నారపల్లి మార్గంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతో పాటు వరంగల్‌ వైపు వెళ్లే వాహనాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నప్పటికీ పలు కారణాల వల్ల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో పనుల్లో వేగం పెంచి వచ్చే ఏడాది జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి ఈ ఫ్లైఓవర్‌ను ఈ ఏడాది దసరా నాటికి అందుబాటులోకి తీసుకురావాలని గతంలో భావించారు. అయితే కాంట్రాక్టు సంస్థకు సంబంధించిన సమస్యలు, న్యాయపరమైన అంశాలు తదితర కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి. ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో నిర్మాణ ప్రక్రియలో అంతరాయం ఏర్పడిందని మంత్రి వివరించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సెకండరీ ఏజెన్సీని రంగంలోకి తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు.

అయినప్పటికీ నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయలేకపోయామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అవరోధాలను తొలగించి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యంతో ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. జాతీయ రహదారి–163పై ఉప్పల్‌–నారపల్లి మధ్య ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.425 కోట్ల అంచనా వ్యయంతో 2018లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో మూడేళ్లలోనే నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ వివిధ కారణాలతో ప్రాజెక్టు గడువు పలుమార్లు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ కారిడార్‌ పూర్తయితే ఉప్పల్‌, నారపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గడంతో పాటు తూర్పు దిశగా ప్రయాణించే వాహనాలకు గణనీయంగా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరాన్ని వరంగల్‌, భువనగిరి, జనగామ ప్రాంతాలతో పాటు బీబీనగర్‌లోని ఎయిమ్స్‌తో అనుసంధానించడంలో ఈ మార్గం కీలకంగా మారనుంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయ అధికారులు, చీఫ్‌ ఇంజనీర్‌తో ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. పెండింగ్‌ అంశాలను పరిష్కరించి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా కొన్ని బీటీ రోడ్డు పునరుద్ధరణ, మరమ్మతు పనులు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. మిగిలిన నిర్మాణ పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి 2027 జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే ఉప్పల్‌–నారపల్లి మార్గంలో ప్రయాణించే వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు నగర తూర్పు వైపు విస్తరిస్తున్న ప్రాంతాలకు రవాణా కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us