
స్మార్ట్ఫోన్ వినియోగం, సోషల్ మీడియా విస్తరణతో యువతులపై సైబర్ మోసాల ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నకిలీ ఆన్లైన్ గుర్తింపులతో పరిచయం పెంచుకుని యువతులను మోసం చేసి, బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. యువత ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్లో ఆకర్షణీయమైన ఫోటోలు, సినీ నటుల చిత్రాలతో నకిలీ ఖాతాలు సృష్టించి యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. పరిచయం ఏర్పడిన తర్వాత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపించేలా ప్రలోభపెడుతున్నారు. ఒకసారి సమాచారం చేతికి చిక్కగానే బాధితులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందికకాడికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఫోటోలను మార్పులు చేసి మరింత ఒత్తిడి తెస్తున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో బాధితులు కుటుంబ సభ్యులకు చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మంది మహిళలు మానసికంగా తీవ్రంగా నలిగిపోతున్నారని, కొన్ని విషాద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇలాంటి వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, లేదంటే పోలీసులను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. అవసరమైతే 100కు కాల్ చేయాలన్నారు. బాధితులుకు అన్నివిధాలుగా పూర్తి సహాయం అందిస్తామని సీపీ సజ్జనార్ భరోసా ఇచ్చారు. పిల్లలతో సమయం గడుపుతూ వారి ఆన్లైన్ కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. నకిలీ ప్రొఫైల్లు, నంబర్లు, VPNలతో తప్పించుకోలేరని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. “ఎక్కడ ఉన్నా నిందుతులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు రావాలని మహిళలకు హైదరాబాద్ నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..