Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పురోగతి.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్, డీసీపీ కలమేశ్వర్..

|

Jan 17, 2021 | 4:36 PM

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో కీలక ఆధారాలు రాబట్టినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ..

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పురోగతి.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్, డీసీపీ కలమేశ్వర్..
Follow us on

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో కీలక ఆధారాలు రాబట్టినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. కిడ్నాప్ కేసుకు సంబంధించిన ఆదివారం నాడు సీపీ అంజనీ కుమార్, నార్త్ జోన్ డీసీపీ కలమేశ్వర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత మాట్లాడిన అంజనీ కుమార్.. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ముందుగా 10 నుంచి 15 మంది పాల్గొన్నట్లు తెలిందన్నారు. తరువాత విచారణలో మరికొంత మంది పేర్లు బయటకు వచ్చాయని చెప్పారు. ఈ కేసులో భూమా అఖిల ప్రియ ప్రధాన నిందితురాలుగా ఉన్నట్లు గుర్తించామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పోలీస్ కస్టడీలో అఖిల ప్రియ మరికొన్ని విషయాలు బయటపెట్టారని, దాంతో ఈ కిడ్నాప్ కేసులో ఎవరి ప్రమేయం ఏంటి అనేది తేలిందన్నారు.

మొత్తంగా ఈ కేసులో మరో 15 మంది ప్రమేయం ఉన్నట్లు తేల్చినట్లు సీపీ వెల్లడించారు. నవీన్ రావు, ప్రవీణ్ రావు, సునీల్ రావులను కిడ్నాప్ చేసేందుకు బోయా సంపత్, బాల చెన్నయ్య అనే ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలిందని సీపీ అంజనీ కుమార్ వివరించారు. గుంటూరు శ్రీనుకు స్నేహితుడైన సిద్ధార్థ.. ఈ ముగ్గురిని కిడ్నాప్ చేసేందుకు కారును ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. ఇక దేవరకొండ కృష్ణ అనే వ్యక్తి కిడ్నాప్ చేసే మయంలో కానిస్టేబుల్ డ్రెస్‌లో వచ్చాడని, అతన్ని ఇప్పటికే అరెస్ట్ చేశామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. అయితే, భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్ సోదరుడు చంద్రహాస్, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు, మాదాల శ్రీను పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

యూసఫ్ గూడ‌లోని ఎంజీహెచ్ స్కూల్‌లో జనవరి 4వ తేదీన నవీన్ రావు, ప్రవీణ్ రావు, సునీల్ రావులను కిడ్నాప్ చేసేందుకు దుండులు పథకం వేశారని నార్త్ జోన్ డీసీపీ కలమేశ్వర్ వివరించారు. అధికారులు చెప్పినదాని ప్రకారం.. తొలుత ఈ కిడ్నాప్ కోసం గుంటూరు శ్రీను, సిద్ధార్థ్ అనే వ్యక్తిని ఆశ్రయించాడు. కిడ్నాప్ కోసం 15 మంది అవసరం అని, ఆ మేరకు మనుషులను పంపించాలని శ్రీను.. సిద్ధార్థ్‌ను కోరాడు. ఒక్కొక్కరికి రూ. 25వేలు ఇస్తామని ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అన్నీ ఓకే అయ్యాక.. కిడ్నాప్ కోసం ఐటీ అధికారుల్లా వేషం మార్చిన దుండుగులు.. ఐదు వాహనాల్లో ప్రవీణ్ రావు ఇంటికి వెళ్లారు. అక్కడ ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావులను మూడు వాహనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన తరువాత.. ముగ్గురు బాధితులను మొయినాబాద్‌లోని భార్గవ్ రామ్ ఫామ్‌ హౌస్‌కి తీసుకెళ్లారు. ఆక్కడ ముగ్గురి నుండి మూడు పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. అయితే, నకిలీ నెంబర్ ప్లేట్స్‌తో ఉన్న మూడు వాహనాల్లో ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావులను కిడ్నాప్ చేసిన తరువాత రెండు వాహనాలను భార్గవ్ రామ్, జగన్ విఖ్యాత్ రెడ్డిలు నడిపారు. దీంతో టెక్నికల్ ఎవిడెన్స్ లభించినట్లైందని, అలా కేసును త్వరగా చేధించామని డీసీపీ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులైన ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావులను జనవరి 5 తేదీన బోయిన్‌ పల్లిలో వారి నివాసంలో కొందరు దుండగలు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును నగర పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే చేధించారు. కిడ్నాప్‌నకు గురైన ముగ్గురిని రక్షించడంతో పాటు.. కిడ్నాప్ చేసిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని తేల్చారు. దాంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీ 448, 419, 341, 342, 506, 366, 385, 149, 147 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని కిడ్నాప్ చేయడానికి హఫీజ్‌పేటలో గల భూ వివాదమే కారణమని పోలీసులు నిర్ధారించారు.

Also read:

రెగ్యులర్ రైళ్లు తిరిగి ప్రారంభమయ్యేది అప్పుడేనా.? మార్చి నెలాఖరు దాకా ప్రత్యేక ట్రైన్స్ పొడిగింపు.!!

Hero Shahid kapoor: పౌరాణిక సినిమాలో నటించనున్న షాహిద్ కపూర్ ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో జతకట్టనున్న హీరో..