Telangana: 50 ఏళ్ల కాలం కరిగినా.. స్నేహం చెదరలే..

వారంతా మనవళ్లు, మనవరాళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. రామా .. కృష్ణా .. అంటూ గడుపుతున్నారు. కొందరు షష్టిపూర్తి కూడా జరుపుకున్నారు. అయినా వారి స్నేహం చెదిరిపోలేదు. ఈ వయస్సులో వాళ్లంతా విద్యార్థులుగా మారిపోయారు. వీరంతా అపూర్వ సమ్మేళనం ద్వారా కలుసుకున్నారు. ..

Telangana: 50 ఏళ్ల కాలం కరిగినా.. స్నేహం చెదరలే..
50 Years Reunion

Edited By:

Updated on: Feb 03, 2026 | 4:53 PM

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ చదివిన వారు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఈ పాఠశాలలో 1974- 75లో పదో తరగతి చదివిన విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో గడిపే వారంతా ఈ స్వర్ణోత్సవ సమ్మేళనంలో స్నేహ మాధుర్యంలో మునిగిపోయారు. అందరూ స్వీయ పరిచయాలు, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

50 ఏళ్లతరువాత మళ్లీ ఒకే వేదికపైకిరావడంతో బాల్య స్నేహితులందరూ ఆనాటి జ్ఞాపకాలను తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు.పాఠశాల తరగతి గదులు, ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యార్థి జీవితంలోని మధుర క్షణాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. హోదాలు, బాధ్యతలను పక్కనబెట్టి మళ్లీ విద్యార్థులుగా మారిన ఆ మధుర క్షణాలు సమ్మేళానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక్కటే నవ్వులు, కన్నీళ్లు, ఆనందం కలసి ఈ సమావేశాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చాయి. ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారి పండగ వాతావరణాన్ని తలపించింది. అందరూ సెల్ఫీలు దిగుతూ ఒకరినొకరు పలకరించుకుంటూ నాటి మిత్రులతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి విద్యాకర్, బరిగల వీరయ్య, జక్కుల వెంకటేశ్వర్లు, లక్కాకుల వెంకటకృష్ణ, సురేందర్, బార్ వెంకటేశ్వర్లు, వేటూరి మధు, హరికిషన్, సత్యనారాయణ, ఎస్. రవికుమార్, అద్దంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాటి గురువులు అరవపల్లి రంగారావు, అంకతి అప్పయ్య, నారాయణం రఘునాథ్, వెంకటేశ్వరశాస్త్రి, సత్తయ్య, మంగయ్యలను సన్మానించుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us