
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్పూర్ సమీప ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి ముందుగా డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో ప్రమాదం తీవ్రరూపం దాల్చింది.
ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న ఓఆర్ఆర్ అంబులెన్స్ సిబ్బంది వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం స్కార్పియో అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలు, మృతులు మరియు గాయపడిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..