
సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ యువకుడి విషయం పోలీస్ స్టేషన్ పై దాడికి దారితీసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దరఖాస్తుపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వి, లోపలికి దూసుకెళ్లి ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ అసలు ఏం జరిగింది? గ్రామస్తుల ఆగ్రహానికి కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ గొడవకు అసలు కారణం వట్పల్లి పరిధిలోని ఓ దాబాలో పనిచేసే 22 ఏళ్ల బీరప్ప అనే యువకుడి అనుమానాస్పద మృతి.. అని స్థానికులు తెలిపారు.
దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప శనివారం ఉదయం దాబా వెనుక ఉన్న చెట్టుకు ఉరివేసుకుని శవమై కనిపించాడు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులకు కానీ, గ్రామస్తులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పోలీసులు మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించడమే వివాదానికి కారణమైంది. దీంతో వట్పల్లి పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన దరఖాస్తుపల్లి గ్రామస్తులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు. స్టేషన్ లోపలికి చొరబడి కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్లు సహా ఫర్నిచర్ను బద్దలు కొట్టారు. కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. చూస్తుండగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో వట్పల్లి పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది.
పోలీసులు, దాబా యజమానులు కుమ్మక్కై.. ఆధారాలు తుడిచేసేందుకే తమకు చెప్పకుండా డెడ్ బాడీని కిందకు దించారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న దాబా వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు.. అక్కడ నుంచి నేరుగా వట్పల్లి పోలీస్ స్టేషన్ వైపు తరలివచ్చారు. తమకు సమాధానం చెప్పాలంటూ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసుల నిర్లక్ష్య సమాధానాలతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో స్టేషన్పై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.
విషయం తెలియగానే వట్పల్లి పోలీస్ స్టేషన్ కి సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య చేరుకోని వివరాలను తెలుసుకున్నారు.. కాగా మృతుడికి బెట్టింగ్ ఆడే అలవాటు ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు సమాచారం.. మరో వైపు పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారి వివరాలను పోలీసులు రాబడుతున్నారు.. వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటన సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..