Rains Updates: ఉప్పొంగిన గోదారమ్మ.. ఎనిమిదేళ్ల తర్వాత జూలై నెలలోనే పొంగిపొర్లిన ప్రాజెక్టులు..!

|

Jul 23, 2021 | 12:10 PM

Rains Updates: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నదుల్లో ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జూలైలోనే శ్రీరాంసాగర్‌..

Rains Updates: ఉప్పొంగిన గోదారమ్మ.. ఎనిమిదేళ్ల తర్వాత జూలై నెలలోనే పొంగిపొర్లిన ప్రాజెక్టులు..!
Follow us on

Rains Updates: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నదుల్లో ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జూలైలోనే శ్రీరాంసాగర్‌ సహా గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్‌లోనూ ప్రవాహాలు పెరిగాయి. ఎగువన కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వస్తున్న వరద మొత్తం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వైపు ప్రవహిస్తోంది.

ఎగువ రాష్ట్రాల నుంచి పెరిగిన ప్రవాహాలు ఓవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరోవైపు.. దీంతో నదులకు భారీగా వరద పెరిగింది. గోదావరిపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండిపోయింది. నిన్న సాయంత్రానికి ప్రాజెక్టులో 90 టీఎంసీల సామర్థ్యానికి 89.76 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో.. 36 గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరద కాళేశ్వరం బ్యారేజీలను దాటి దిగువకు వెళ్తోంది.

ప్రాణహిత ఉధృతితో మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 35 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రవాహాలు చేరితే మొత్తం గేట్లన్నీ ఎత్తివేయనున్నారు. మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు.

కృష్ణా నదిలో ఎగువన కర్ణాటక ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్‌ నిండిపోయాయి. నారాయణపూర్‌ నుంచి లక్షా 28 వేల క్యూసెక్కులను రిలీజ్ చేస్తున్నారు. జూరాల, శ్రీశైలానికి వరద పెరుగుతోంది. జూరాలకు 70 వేల క్యూసెక్కులు వరద వస్తుండగా.. 69 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 63 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. నీటి నిల్వ 215 టీఎంసీల సామర్థ్యానికిగాను 72.05 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం నుంచి 21 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి.

కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణానదిలో ఒకట్రెండు రోజుల్లో మూడు నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం అంచనా వేస్తోంది. మూసీ ప్రాజెక్టు నిండిపోవడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్‌లోని 28, కృష్ణా బేసిన్‌లోని 8 ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అలాగే చెరువులు అలుగు దుంకుతున్నాయి.

 

ఇవీ కూడా చదవండి:

Heavy Rain: భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌.. వాగు దాటుతూ వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఆవులుడు పదార్థాలు స్వాధీనం

Heavy Rains: భారీ వర్షాలకు అతలాకుతలం.. విరిగిపడ్డ కొండచరియలు.. చిక్కుకున్న 300 మంది.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌