Hyderabad Rains: భాగ్యనగరంలో భారీ వర్షాలు..వరద ముంపులో కాలనీలు.. 150 కుటుంబాలు సురక్షిత ప్రాతాలకు తరలింపు

Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి..

Hyderabad Rains: భాగ్యనగరంలో భారీ వర్షాలు..వరద ముంపులో కాలనీలు.. 150 కుటుంబాలు సురక్షిత ప్రాతాలకు తరలింపు
Hyderabad Rains

Updated on: Oct 09, 2021 | 6:27 PM

Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో భాగ్య నగరంలో డ్రైనేజ్ ఎక్కడుందో అర్ధం కాలేదు. జోరువానలో.. చిమ్మ చీకట్లో జీహెచ్‌ఎంసీ వాసులు శుక్రవారం పడరాని పాట్లు పడ్డారు. ముఖ్యంగా శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ, అతి భారీ వర్షాలకు హయత్ నగర్ డివిజన్ లోని లంబాడీ తండ కాలనీలో వరద నీరు చేరుకుంది. దీంతో  జీహెచ్ఎంసి అధికారులు కాలనీలోని 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

కాలనీ నీట మునిగిందని సమాచారం అందుకున్న మేయర్ గద్వాల విజయ లక్ష్మి వెంటనే స్పందించారు. హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ కు ఫోన్ చేసి లంబాడీ తండ వాసులను తరలించాలని ఆదేశించారు. మేయర్ వెంటనే వారిని తరలించేందుకు అక్కడికి వాహనం కూడా పంపించారు. డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ ఆధ్వర్యంలో బాధిత 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారికి త్రాగు నీరు భోజన వసతి కల్పించారు.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అమీర్‌పేట్‌లో రికార్డు స్థాయిలో 13.68 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక  కుర్మగూడలో 10 సెంటీమీటర్లు, మహేశ్వరంలో 9 సెంటీమీటర్ల, దక్షిణ హస్తినాపురం ప్రాంతంలో 8.83 సెంటి మీటర్లు, మలక్‌పేటలో 8.7 సెం.మీ , సరూర్‌నగర్‌లో 8.6సెం.మీ, కంచన్‌బాగ్‌లో 8.4సెం.మీ, బహదూర్‌పురాలో 8.1సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈరోజు కూడా హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. ఈ క్రమంలో నగరంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించించింది.

Also Read:   17 ఏళ్ల కుర్రాడు కూడా సమస్యలపై పోరాడే తత్వం తెలంగాణ సొంతమన్న పవన్ కళ్యాణ్..