
భాగ్యనగర ఐటీ కారిడార్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సైబరాబాద్ నగరపాలక సంస్థ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సుమారు రూ. 2,500 కోట్ల వ్యయంతో హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను చేపట్టింది. అయితే మరో 18 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎంసీ కమిషనర్ జి.సృజన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాజాగా శనివారం పనుల పురోగతిని సమీక్షించిన కమిషనర్, వివిధ ప్రాజెక్టుల పూర్తికి స్పష్టమైన కాలపరిమితిని విధించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన అమీన్పూర్ రోడ్డు విస్తరణ పనులను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి చేయయనున్నట్టు తెలిపారు. అలాగే గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ జంక్షన్లో చేపట్టిన ప్లైఓవర్, ఖాజాగూడ జంక్షన్ల వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల నిర్మాణం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే కూకట్పల్లి ఐడీఎల్ చౌరస్తా వద్ద ప్రారంభమైన ఫ్లైఓవర్ నిర్మాణం, కొండాపూర్ అంజయ్యనగర్ రోడ్డు విస్తరణ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయన్నారు.
తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులు పూర్తయితే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు భారీ ఊరట లభిస్తుందని ఆమె తెలిపారు. ఈ రూట్లో ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోయి ప్రయాణ సమయం కూడా చాలా వరకు తగ్గుతుందంటున్నారు.
పారిశుధ్యంపై కఠిన హెచ్చరికలు:
ఇదిలా ఉండగా అభివృద్ధి పనులతో పాటు నగర స్వచ్ఛతపై కమిషనర్ సీరియస్ అయ్యారు. ఐటీ కారిడార్లోని వ్యాపారులు, తోపుడు బండ్ల నిర్వాహకులు తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది వ్యాపారులకు పనివారు కాదని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. చెత్తను రోడ్లపై పారబోస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.