
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం ముసుగులో గంజాయి సాగు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్, తాండూర్ పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల సంయుక్త బృందం ఆపరేషన్ చేపట్టింది. యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న 36 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వేర్లతో సహా తొలగించిన ఈ మొక్కల మొత్తం బరువు సుమారు 28 కిలోలుగా అధికారులు నిర్ధారించారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గోవిందరావుపేటలోని సర్వే నెం.410లో ఆశ్రమం నిర్వహిస్తున్న జై శ్రీరామ్ గిరి (43), సాధ్వి సంగం గిరి (45) రహస్యంగా గంజాయి మొక్కలను సాగు చేస్తూ వాటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన దాడిలో ఆశ్రమ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల్లో పెంచిన గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొక్కల ఎత్తు రెండు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల వరకు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిర్వహించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం పంచనామా పూర్తి చేశారు.
ప్రాథమిక విచారణలో నిందితులు గత కొంతకాలంగా గంజాయి వినియోగిస్తున్నట్లు, ఏడాది క్రితం ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడే గంజాయి సాగు ప్రారంభించినట్లు వెల్లడైంది. విచారణలో భాగంగా భూమి పప్పులాల్ కుమావత్ పేరిట నమోదై ఉన్నట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించడంతో భూ యజమానిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.
ఈ ఘటనలో జై శ్రీరామ్ గిరి, సాధ్వి సంగం గిరి, పప్పులాల్ కుమావత్ లపై యాలాల పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి 36 గంజాయి మొక్కలతో పాటు ఒక మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గంజాయి సాగు చేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా లేదా విక్రయించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..