
ఊరు-వాడల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. వినూత్న ఆకారాలు వింత వింత రూపాల్లో గణపతి విగ్రహాలు ప్రతిష్టించిన భక్తజనం అత్యంత భక్తిశ్రద్ధలతో గణపతి పూజలు నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి అబ్బుర పరిచే ఆకారాల్లో గణపతి మండపాలు సెట్టింగ్ చేశారు. నవరాత్రులు ఎంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారో చివరరోజు అంతే ఘనంగా గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనంపడం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకత.. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరువు చాయలు అలముకున్నాయి.. ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి
నిమజ్జనానికి నీళ్లేడ
కనీసం 50శాతం కూడా వర్షపాతం నమోదు కాకపోవడంతో చెరువులు, కుంటలు, వాగులలో నీళ్ళు అడుగంటాయి.. జీవనది గోదావరి కూడా ఎడారిని తలపిస్తుంది.. సహజంగా గోదావరి పరివాహక గ్రామాలు, పట్టణాల్లో గణపతి విగ్రహాలను చివరి రోజు ఉత్సాహంగా ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేస్తారు.. అయితే పారేనీటిలో గణపతి నిమర్జనం జరపడం ఇక్కడి సెంటిమెంట్. కానీ ప్రస్తుతం గోదావరిలో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఉత్సవ కమిటీలలో నిరుత్సాహం ఆవహించింది.
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అయోమయం
ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని భక్తుల్లో ఈ ఆందోళన తీవ్రంగా ఉంది. విగ్రహాలను ఉత్సాహంగా ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేస్తారు. కానీ నది మధ్యలో కేవలం ఓ చిన్న వాగులా నీళ్లు ప్రవహిస్తుండటంతో, అంత భారీ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది.
ట్రైసిటీస్లో చెరువుల పరిస్థితీ అదే..
పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్ పరిధిలో సుమారు 10 వేల విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఇక్కడ మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతుంది. భారీ విగ్రహాలను వరంగల్ ప్రాంతానికి చెందిన చిన్నవడ్డేపల్లి, హనుమకొండలోని బంధం చెరువులో నిమజ్జనం చేస్తుంటారు. అయితే, ఈ రెండు చెరువుల్లోనూ సరిపడా నీళ్లు లేకపోవడంతో అధికారులు, భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.