తెలంగాణాలోనే నిమ్మ, బత్తాయి సాగుకు ఒరిజినల్ కేరాఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లానే. ఈసారి దాదాపు 13 వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగు చేశారు రైతులు. రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. కరోనా, లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు విక్రయాలు లేకపోయినా పెట్టుబడి పెట్టి నిమ్మ తోటలు సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర మాత్రం లేదు. అకాల వర్షాలకు 165 ఎకరాల్లో నిమ్మ పంట దెబ్బతింది.
గతంలో ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు కనీసం హైదరాబాద్ మార్కెట్క్కూడా ఎగుమతుల్లేవు. నిమ్మకాయలు కోసి నకిరేకల్లోని మార్కెట్లో రాత్రిపూట విక్రయించాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా దళారులు రెచ్చిపోతున్నారు. కూలీల రేటు, రవాణా ఖర్చులు, వ్యాపారుల కమీషన్లు పోనూ మిగిలేది బూడిదే.
గత ఏప్రిల్, మే నెలల్లో కిలో 65 రూపాయలకు అమ్మేవాళ్లు. ఈ ఏడాది 15 రూపాయలకు పడిపోయింది. ధర తగ్గడంతో టన్ను నిమ్మ 1,500 రూపాయల చొప్పున తెగనమ్ముకుంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి పాతిక్కోట్లకు పైగా నష్టపోయాడు ఇక్కడి నిమ్మరైతు. తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోెసం